ప్రకాశం: వైయస్ఆర్ కుటుంబానికి బూచేపల్లి కుటుంబం ఎప్పుడూ విధేయులుగా ఉంటుందని, శ్రీరాముడుకి ఆంజనేయుడి వలే.. సీఎం వైయస్ జగన్ బాటలో తాను ఎల్లప్పుడూ నడుస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. చీమకుర్తిలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణకు వచ్చిన సీఎం వైయస్ జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రంలో దమ్మున్న నాయకుడు, మాట తప్పని, మడమ తిప్పని వంశంలో పుట్టిన సీఎం వైయస్ జగన్ సింహంలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వందశాతం నెరవేర్చిన దమ్మున్న నాయకుడు సీఎం వైయస్ జగన్ అన్నారు. ఈ రాష్ట్రంలో 31 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజలందరి ఆశీస్సులు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిపై, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నానన్నారు.