కర్నూలు: ఎన్నికల యుద్ధానికి వైయస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమవుదామని వైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో సిద్ధం బహిరంగ సభ పోస్టర్లను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆవిష్కరించారు. అనంతరం వై. కానాపురం గ్రామంలోని శివాలయంలో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ప్రత్యేక పూజ చేశారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చనుగొండ్ల గ్రామంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైయస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల పార్టీ ప్రతినిధులతో అనంతపురంలో నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో సహా రాయలసీమలోని అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభకు ప్రతి గ్రామం నుంచి కనీసం 100 మంది కార్యకర్తలు హాజరై ప్రతిపక్ష నాయకుల గుండెల్లో గుబులు పుట్టించాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించనున్న సిద్ధం కార్యక్రమానికి కార్యకర్తలు, పార్టీ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలిరావాలని కోరారు. టీడీపీ, జనసేన కలిస్తే అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 99శాతం సీఎం వైయస్ జగన్ అమలు చేశారని అన్నారు. 56 నెలలు కాలంలో రూ.2.53 లక్షల కోట్లు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డీపీటీ ద్వారా జమ చేశారని సతీష్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. సిద్ధం సభలో నాయకులు, కార్యకర్తలకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేస్తారన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ భర్త ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి మౌలాలి, ఎంపీటీసీ రంగయ్య, వై కానాపురం వార్డ్ మెంబర్ రంగయ్య, వైయస్ఆర్ సిపి నాయకులు, గోవిందు రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జుల లక్ష్మీకాంత్ రెడ్డి , మాధవస్వామి, పాల దస్తగిరి, బడే సాహెబ్, మహమ్మద్ భాష, రామచంద్ర, ఆదినారాయణ, రంగయ్య, నరసింహులు, గోవిందయ్య, కృష్ణయ్య, రాముడు, వెంకటేష్, ఊరుకుందు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.