హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కేకులు కోసి, బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ♦ వైయస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా వైయస్ఆర్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్ నాయకులు, నరేష్, రమేష్, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ♦ ఖమ్మం నగరంలో వైయస్ఆర్ సీపీ సంబరాలు అంబరాన్ని అంటాయి. కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ దార్ల అశోక్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. ♦ హైదరాబాద్లోని ప్రగతి మహా విద్యాలయలో వైయస్ జగన్ స్నేహితులు కేక్ కోసి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైయస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రొజెక్టర్ ద్వారా తెరపై వీక్షించి పులకించిపోయారు. వేడుకలతో ప్రగతి మహా విద్యాలయలో పండగ వాతావరణం నెలకొంది. చెన్నైలో అన్నదానం ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వైయస్ఆర్ సీపీ నేతలు చెన్నైలో అన్నదానం చేశారు. వెయ్యి మందికి పైగా బిర్యానీ పంచారు. వైయస్ఆర్ సీపీ నేతలు దువ్వూరి సురేష్ రెడ్డి, కడివేటి గోపాలకృష్ణా రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.