విశాఖపట్నం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తమ శాఖకి అవసరమైన బడ్జేట్ను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అదనంగా అడిగిన రూ. 129 కోట్లు సీఎం వైయస్ జగన్ కేటాయించినట్లు వెల్లడించారు. తమ తరపున తొలిసారి ఉద్యోగులకు గ్రీవెన్స్ నిర్వహించామని, ఉద్యోగుల సమస్యలను గత కొన్నేళ్లుగా పట్టించుకొకపోవడం వల్లే ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ, ఇతరత్రా కారణాల వల్ల సస్పెండ్ అయిన కొంతమంది ఉద్యోగులు పదవి విరమణ ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని తెలిపారు. ఇక గ్రీవెన్స్ ద్వారా ప్రతీ ఉద్యోగి సమస్యను తమ దృష్టికి తీసుకు వస్తే సత్వర పరిష్కారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పౌష్టికాహారం అబ్ధిదారులకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 77 మండలాల్లో వైయస్ఆర్ సంపూర్ణ పోషణను పైలట్ ప్రాజెక్ట్గా తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమారాలను ఏర్పాటు చేయాలిన ఈ సమీక్షలో నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి... త్వరలో సీసీ కెమారాల ఏర్పాటు కార్యక్రమాలను మొదలు పెడతామన్నారు. ఈ సమీక్ష ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, లోపాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు, సిబ్బంది రాత పూర్వకంగా సమస్యలు తెలిపనట్లు మంత్రి పేర్కొన్నారు.