శ్రీకాకుళం: ఒకప్పుడు ప్రభుత్వ వ్యవస్థల పై వ్యతిరేక భావన ఉండేది అని, దానిని తొలగించిన ఘనత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కింది అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారం మంత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో జగనన్న సురక్ష అనే పథకం గత నెల 23న ప్రారంభం అయ్యింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 732 సెక్రటేరియట్ లలో 84 శాతం ఇళ్లను, ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వలంటీర్లు తలుపు తట్టి వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇది ఒక వినూత్నం అయిన ప్రభుత్వ కార్యక్రమంగా రూపొందింది. ఒక జిల్లాలో ఆరు లక్షలు దాటిన ఇళ్లను సేవకులు (వలంటీర్లు ) వెళ్లి టచ్ చేసి వారి కష్ట సుఖాలను, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్నది తెలుసుకుని, అందకుంటే అందేవిధంగా చేయడం ఇంత తక్కువ సమయంలో అర్హులకు ధ్రువీకరణ పత్రాలు అందించడం గొప్ప విజయం. వివిధ సేవల ద్వారా సుమారు 3,33,794 సర్టిఫికెట్లు అందించాం. ఏడు వందలకు పైగా సెక్రటేరియట్ల పరిధిలో పంపిణీ చేశాం. ఒకనాడు పనులు కావాలంటే మండల కార్యాలయాలకు పోవాలి. నిస్సహాయులలో ఎవరైనా తనకు చదువు రాదు కనుక ఒక వ్యక్తి సహాయం తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు,నిస్సహాయులు,ఆర్థిక బలం,కండ బలం లేనటువంటి వారు ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు అందుకోకపోవడంతో,ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడం తో జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశాం. నాలుగేళ్ల క్రితం - గత ప్రభుత్వం లో నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో పరిస్థితులను చూడండి. ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ వార్డును తీసుకున్నా, ఏ పట్టణాన్ని తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. ఒకవైపు లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారు. ఏ పనికోసం వెళ్లినా మీరు ఏ పార్టీకి చెందిన వారు అనే ప్రశ్న ఎదురయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా పోయింది. అర్హత కలిగి ఉంటే చాలా నేరుగా గుమ్మం వద్దనే పథకాలు అందుకుంటున్నారు. పేదలకు ప్రభుత్వ సేవలే లక్ష్యంగా జగనన్న సురక్ష. ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా... ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహసారధులు, మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ నేరుగా ఆ పేద లబ్ధిదారుల దగ్గరకు జగనన్న సురక్షా కార్యక్రమంలో వెళ్ళారు. నోరు తెరిచి అడగలేని, అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులును కూడా తలుపుతట్టి మరీ మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష పథకం. ఇది పౌరులలో విశ్వాసం నింపింది. ఇతర ప్రభుత్వాలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది ఒక యజ్ఞంలా జరిగింది రాష్ట్రంలో.. దేశానికే ఆదర్శంగా నిలిచింది జగనన్న సురక్ష కార్యక్రమం. నేను స్వయంగా శిబిరాలను చూశాను. స్వయంగా పర్యవేక్షించాను. అక్కడ ధ్రువపత్రాలు అందుకుంటున్న వారి ముఖాల్లో చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష - శ్రీరామ రక్ష 11 రకాల సేవలను అందించడం ద్వారా ఇంకా ఎవ్వరైనా పథకాలు అందుకోలేకపోతే వీరు అందుకున్న ధ్రువపత్రాల ద్వారా ఇవి వారికి ఉపయోగపడతాయి. జగనన్న సురక్ష ఓ విధంగా శ్రీ రామ రక్షే ఈ సురక్ష బలహీన వర్గాలకు, నిరుపేదలకు, నిస్సహాయులకు ఆత్మ విశ్వాసం అందించింది. అందుకే ఇది శ్రీరామ రక్ష అయింది. పూర్తిగా ఉచితంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సేవలు అందించాం. నేను ప్రాతినిధ్యంవహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో 45 వేల మందికి ఈ సేవల ద్వారా సర్టిఫికెట్లు అందించాం. జిల్లాలో మూడు లక్షల మూప్పై మూడు వేల ధ్రువ పత్రాలు అందజేస్తే ఒక్క శ్రీకాకుళం 45,007 ధ్రువ పత్రాలు అందజేశారు. ఇవన్నీ సిస్టమేటిక్ గా చేశారు. ఇది మా కార్యక్రమం అన్న విధంగా చేశారు. ప్రతి మండలంలో అధికారులు రెండు టీంలుగా విడిపోయి పనిచేశారు. కలెక్టర్ మానిటరింగ్ లో అంతా బాగా పనిచేశారు. అధికారులు, వలంటీర్లు, గృహ సారథులు బాగా పనిచేశారు. ఇలాంటి వ్యవస్థలపై స్టడీ చేయకుండా కొందరు వ్యాఖ్యలు చేయడం దురదృష్టం. ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూసైనా,ఈ వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని కోరుతున్నాను. వలంటీర్ల వ్యవస్థపై కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరం. ఇప్పుడయినా వారి ప్రవర్తనను దిద్దుకోవాలని కోరుకుంటున్నాను.. అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.