విభజన హామీలు సాధనకు పార్లమెంటులో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌

వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ విప్, ఎంపీ  మార్గాని భరత్  

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతాం.

బిల్లులో ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ వంటి కీలకాంశాలు

పొలవరం నిధులపై మిథున్‌రెడ్డి మరో ప్రైవేటు మెంబర్‌ బిల్‌: ఎంపీ మార్గాని భరత్‌

విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..?

రామాయపట్నం పోరుక్టు నిధులెందుకు ఇవ్వడం లేదు..?

ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. 

మోడీ ప్రత్యేక హోదా ఇస్తే చరిత్రలో నిలిచిపోతారు: ఎంపీ మార్గాని భరత్‌

రాష్ట్ర హక్కుల సాధనపై.. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశం

పార్లమెంటు వేదికగా అన్ని అవకాశాలూ వినియోగించుకుంటాం

అన్నింటికన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.

ఢిల్లీ క్యాపిటల్‌ బిల్లుపై టీడీపీ వారిది గోడ మీద పిల్లవాటం

రాష్ట్ర అప్పులపై ప్రశ్నలతో టీడీపీ వారే అభాసుపాలయ్యారు

ఎంపీ  మార్గాని భరత్‌

న్యూఢిల్లీ: విభజన హామీలు సాధనకు పార్లమెంటులో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ విప్, ఎంపీ  మార్గాని భరత్ పేర్కొన్నారు. పది మంది ఎంపీలతో ఏపీ రీఆర్గనైజేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌–2023ను ప్రైవేటు మెంబర్‌ బిల్లుగా ప్రవేశ పెట్టబోతున్నామ‌ని చెప్పారు.   విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లును గతంలో మా పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టార‌ని గుర్తు చేశారు.  అయితే ఆ బిల్లు ఫైనాన్స్ తో ముడిపడిన అంశం కావడం వల్ల లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో మేము ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టామ‌ని చెప్పారు. న్యూఢిల్లీలో మార్గాని భ‌ర‌త్ మీడియాతో మాట్లాడారు.

ఎంపీ మార్గాని భరత్‌ మీడియాతో ఏం మాట్లాడారంటే:

ఏపీ హక్కుల కోసం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌:
- పార్లమెంటులో జరగబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తుతాం. 
- దేశం అంతా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించే విధంగా మేమంతా మాట్లాడతాం. 
- పది మంది ఎంపీలతో ఏపీ రీఆర్గనైజేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌–2023ను ప్రైవేటు మెంబర్‌ బిల్లుగా ప్రవేశ పెట్టబోతున్నాం.  
- విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లును గతంలో మా పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 
- అయితే ఆ బిల్లు ఫైనాన్స్ తో ముడిపడిన అంశం కావడం వల్ల లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో మేము ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టాం. 
- కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. 
- విభజన హామీలపై.. గత ప్రభుత్వంలో చంద్రబాబు యూ టర్న్‌ తీసుకుని ఏపీని వెనక్కు తోశారు. ఆ తప్పిదాలను సవరించుకుంటూ ఏపీకి రావాల్సినవన్నిటినీ  రాబడుతున్నాం. 
- ఈ ప్రైవేటు మెంబర్‌ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రధానంగా ముందు పెడుతున్నాం. 
- పోలవరం నిధులకు సంబంధించి...  ప్రాజెక్టు ఆథారిటీ సవరించిన అంచనాలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ అంచనాలను ఆమోదించాలనే డిమాండ్‌ ఈ బిల్లులో ఉండబోతోంది. 
- విభజన చట్టం ప్రకారం గతంలో రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు..  జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులిచ్చారు.
- ప్రస్తుతం తలసరి ఆదాయం ప్రకారం ఆయా జిల్లాలకు స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేయబోతున్నాం. దీనివల్ల ఒక్కో జిల్లాకు రూ.1000 కోట్లు రావడానికి అవకాశం ఉంది. 
- వాల్తేరు డివిజన్‌ను కలుపుకుని సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ను ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేయనున్నాం. 
- ఈ బిల్లు త్వరలో టేబుల్‌ అవుతుంది.. వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 
- ఆ చర్చలో దేశాన్ని ఆకర్షించే విధంగా మేం ఏపీ హక్కుల కోసం గళమెత్తుతాం. 

పోలవరం సవరించిన అంచనాల ఆమోదంపై మరో బిల్లు:
- మరో వైపు వైఎస్ఆర్సీపీ లోక్ సభా పక్ష నాయకుడు మిథున్‌ రెడ్డి కూడా పోలవరంపై మరొక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌ కూడా పెట్టారు. అది ఇవాళ టేబుల్‌ అవుతోంది. 
- పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548 కోట్లు ఆమోదించాలని ఆయన ప్రత్యేకంగా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును పెట్టారు. 
- పార్లమెంటు వేదికగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ మేం వినియోగించుకుంటున్నాం. 
- ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశంతో మేం పార్లమెంటులో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. 
- మాకు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రాబడుతున్నాం. మొన్ననే రూ.10వేల కోట్లకు పైగా తీసుకొచ్చాం. 
- రాష్ట్ర విభజన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో చంద్రబాబు నిధులు తీసుకురాగలిగాడా..? 
- పోలవరానికి సంబంధించి మరొక రూ.12 వేల కోట్ల నిధులు కూడా త్వరలో విడుదల చేయనున్నారు. 
- ఇవన్నీ సాధించుకుంటూనే కేంద్రానికి ఇష్యూ బేసిస్‌గా మద్దతు ఇస్తున్నాం. 
- బిల్లు దేశానికి మంచి జరిగే విధంగా ఉంటే మేం మద్దతు పలుకుతాం. ఒకవేళ నష్టం జరిగితే మేం మద్దతు పలికేది లేదు. 
- మణిపూర్‌ విషయం చాలా బాధాకరం. దీనిపై చర్చ జరగాలి. 
- దీనిపై 8వ తేదీ నుంచి చర్చ మొదలు కానుంది. దీనిపై కూడా మేం మణిపూర్‌లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చర్చిస్తాం. 

విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..?:
- ప్రైవేటు బిల్లులు పెట్టాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వస్తుందనేది కేంద్రం ఆలోచించాలి. 
- 2014 ఏపీ విభజన చట్టాన్ని మీరు ఎందుకు గౌరవించడం లేదు.. ఆ బాధ్యత మీపై లేదా అనేది కూడా మేం ప్రశ్నిస్తాం. 
- విభజన చట్టంలోని కీలకమైన మరికొన్ని అంశాలను పక్కన పెట్టడం దురదృష్టకరం, బాధాకరం. 
- దుగరాజుపట్నం పోర్టును చట్టంలో పొందుపరిచారు. సాంకేతిక కారణాలతో దాన్ని రామాయపట్నానికి మార్చారు. 
- ఈ పోర్టుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు..? 
- కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఒక పెట్రో కెమికల్‌ రిఫైనరీ తీసుకురావాలి. దానికి కూడా ఏపీ వయబిలిటీ ఫండ్‌ గ్యాప్‌ పెట్టుకోవాలనడం ఏమిటి..? 
- గుజరాత్, పారాదీప్‌లో ఉన్న రిఫైనరీలకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అడిగారా..? 
- ఏపీ వరకూ వచ్చే సరికి ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అనేది కూడా మేం ప్రశ్నిస్తాం. 
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ప్రధాని మోడీ చరిత్రలో నిలిచిపోతారు. 
- విభజన చట్టం ప్రకారం... పదేళ్ల గడువులో ఇక కొది సమయం మాత్రమే మిగిలి ఉంది...కాబట్టి యుద్ధప్రాతిపదికన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని మేం నిలదీయబోతున్నాం.
 
ఢిల్లీ క్యాపిటల్‌ బిల్లుపై టీడీపీ వారిది గోడమీద పిల్లవాటం:
- నేషనల్‌ క్యాపిటల్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 
- దానిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మిథున్‌ రెడ్డి గారు కూడా  మాట్లాడారు. 
- ఈ బిల్లు ఒక ప్రత్యేకమైనది. దేశానికి రాజధానిగా ఉన్న న్యూ ఢిల్లీ పూర్తిగా రాష్ట్రం కాదు. అలా అని కేంద్ర పాలిత ప్రాంతం కాదు. 
- ప్రత్యేకమైన ఇలాంటి ప్రాంతంలో లా అండ్‌ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్‌ పవర్స్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలన్న ఆలోచనతో మద్దతు ఇచ్చాం. 
- కొన్ని వందల దౌత్య కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. వేల మంది దౌత్య వేత్తలు ఇక్కడకు వస్తుంటారు. 
- ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతు పలకింది. 
- ఇదే సందర్భంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వారి స్టాండ్‌ ఏమిటో కూడా చెప్పకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. 
- ప్రతిపక్షాలన్నీ వాకౌట్‌ చేస్తే.. వారు మాత్రం సభలో కూర్చుని ఉన్నారు. 
- ఇదే సమయంలో ఆ బిల్లుపై వారి వైఖరి ఏమిటో దేశానికి తెలియజేయాలి. కానీ కనీసం వారు లోక్‌సభలో దానిపై మాట్లాడను కూడా లేదు. 

అప్పులపై ప్రశ్నలతో టీడీపీవారే అభాసుపాలయ్యారు:
- కేంద్ర ప్రభుత్వం కేటగారికల్‌గా ఏపీ అప్పుల గురించి స్పష్టం చేసింది. 
- పొద్దున లేస్తే టీడీపీ ఎంపీలు, ఒక శిఖండి ఎంపీ కలిసి,  ఏపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. 
- దీని కోసం పార్లమెంటులో అడ్డగోలు ప్రశ్నలు వేస్తూ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నారు. వీరు వేసిన ప్రశ్నలకు కేంద్రం సమాధానంతో వీళ్ళ దిమ్మ తిరుగుతుంది. 
- ఏపీ మొత్తం అప్పు రూ.4,42,442 కోట్లు ఉండగా, దానిలో 2019 నుంచి 2023 వరకూ రూ.1.77 లక్షల కోట్లు అప్పు చేశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం ఇచ్చారు. 
- ఈ నిధులను అనేక రంగాల్లో ఖర్చు చేస్తున్నాం. ముఖ్యంగా నాడు-నేడు కింద విద్య, వైద్య రంగాల్లో సమూలమైన, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. 
- వైద్యరంగంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీసుకొచ్చాం. 5 మెడికల్‌ కాలేజీలు ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 
- ఇది క్యాపిటల్‌ వ్యయం కాదా..?. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాల మాటలు సత్యదూరంగా ఉంటున్నాయి. 

దమ్ముంటే నాపై ఎంపీగా పోటీ చేసి గెలువు లోకేశ్‌:
- లోకేశ్‌ అనే పప్పుశుద్ధను చూసి రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారు. 
- అలాంటి అజ్ఞాని, రాజకీయాల్లో కమెడియన్ ఎంపీల గురించి పదే పదే విమర్శలు చేస్తున్నాడు. 
- నాలుగేళ్లు మీరు బీజేపీతో అంటకాగారు కదా..అప్పుడేం ఏం చేశారు..? 
- అసలు నీకు ఏ అర్హత ఉందని, మీ తండ్రి హయాంలో మూడు శాఖలకు మంత్రిగా చేశావు..?
- వారసత్వం ఉందని రాష్ట్రానికి మంత్రి అయ్యి, చివరికి రాజకీయాల్లో  ఒక జోకర్ గా మిగిలావు. 
- వైఎస్సార్సీపీ ఎంపీలు బెస్ట్‌ ఎంపీలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం ప్రశంసించారు. 
- దేశం మొత్తంలో ఏపీకి నేషనల్‌ హైవేస్‌ విషయంలో అధికంగా నిధులు తీసుకొచ్చాం. 
- గతంలో మీ ఎంపీలంతా రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. 
- లోకేశ్ కు చాలెంజ్‌ విసురుతున్నా...ధైర్యం ఉంటే నాపై ఎంపీగా పోటీ చెయ్‌ లోకేశ్‌. 
- నన్ను రీల్స్‌ అంటున్నావుగా..నిజంగా నువ్వు చంద్రబాబు వారసుడివైతే నాపై పోటీ చేసి గెలువు. 
- నువ్వు హీరోవో..నేను హీరోనో తెలుస్తుంది. 

తాజా వీడియోలు

Back to Top