తాడేపల్లి: అమరావతిలో వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడాన్ని తట్టుకోలేక వైయస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగడం దారుణమని వైయస్ఆర్సీపీ పొన్నూరు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళి, దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు లు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ... భారీ వర్షాలకు వరదనీరు అమరావతిని ముంచెత్తిన పరిస్థితిపై మాట్లాడటం నేరమా? వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం దోషమా అని ప్రశ్నించారు. అమరావతిలో వారం రోజుల పాటు వరదనీటితో ముంపునకు గురైన నేపథ్యంలో వెస్ట్రన్ బైపాస్కు గండికొట్టి, నీటిని బయటకు పంపామని స్వయంగా కూటమి ప్రభుత్వంలోని మంత్రి నారాయణే మీడియా ముందు అంగీకరించారని గుర్తు చేశారు. నిజం చెప్పిన మంత్రి నారాయణ పైన కూడా కేసులు పెడతారా అని నిలదీశారు. వరద ముంపుపై వాస్తవాలను గ్రహించి, దానికి తగిన పరిష్కారాన్ని అన్వేషించడం మాని, వాస్తవాలను చూపించారంటూ కేసుల పేరుతో బెదిరించడం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే... వాగుల్ని పటిష్టం చేయకుండా రాజధాని నిర్మాణం సాధ్యం కాదు : అంబటి మురళి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు పొంగినప్పుడు వరదను గుంటూరు ఛానెల్కి మళ్లించడం ద్వారా అమరావతి రాజధానితోపాటు పొన్నూరు, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడులోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. కొండవీటి వాగు ప్రవాహం వల్లే రాజధానితో పాటు పక్క నియోజకవర్గాల్లో ఉన్న పంట పొలాలు మునిగాయనేది మాతోపాటు రైతులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదైనా నిర్మాణం చేయాలంటే నేచురల్ కాంటూర్ లెవల్స్తో నాలా, కల్వర్టులను పటిష్టం చేయాలి. అలా కాకుండా ఇళ్లు కానీ, రాజధాని కానీ, ఏ నిర్మాణమైనా పటిష్టం చేయడం సాధ్యం కాదు. కానీ అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఇలా జరగలేదనేది మా అభిప్రాయం. కొండవీటి నుంచి ప్రవహిస్తున్న కొండవీటి వాగుకి రాజధాని ప్రాంతంలో ఎర్రవాగు, కోటెళ్ల వాగు, పాలవాగు, అయ్యన్న వాగు అనే మరో నాలుగు వాగులు అదనంగా వచ్చి చేరుతాయి. ఈ విషయాన్ని గతంలో టీడీపీ హయాంలో పంప్హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. ఈ నాలుగు వాగుల్ని ఛానలైజ్ చేయకుండా నీటిని మళ్లించడం, పూడ్చివేయడం ద్వారా చంద్రబాబు కొత్త సమస్యలు కొనితెచ్చారు. గతంలో హామీ ఇచ్చినట్టు కొండవీటి వాగుని 30 మీటర్ల నుంచి కింద 120 మీటర్లు, పైన 180 మీటర్లు వెడల్పు చేయకుండానే నాలుగు వాగుల్ని కొంతమేర మూసేశారు. దీనివల్ల భారీగా వచ్చిన వరద నీరు ముందుకు ప్రవహించే మార్గం లేక కొండవీటి వాగు పొంగిపొర్లింది. వరద నీరు తరలించడానికే వెస్ట్రన్ బైపాస్ కి గండి కొట్టారు. ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం పుంపులతో కృష్ణా నదిలోకి, డౌన్లో ఉన్న కృష్ణా వెస్ట్రన్ డెల్టా కెనాల్కి కొంత మళ్ళించారు. అయినా ఖాజా టోల్ ప్లాజా వద్ద గత 50 ఏళ్లుగా ఎప్పుడూ చూడని విధంగా ఆరడుగుల నీరు ప్రవహించింది. పక్కనే ఉన్న భారీ అపార్ట్మెంట్ల లోకి నీరు చేరి రెండు సెల్లార్లు మునిగిపోయి, కాంపౌండ్ వాల్ కూడా కూలిపోయింది. కోటెళ్ల వాగు, పాలవాగుని మూసేయడంతోపాటు దాన్ని డైవర్ట్ చేయడం వల్ల ఆ నీటిని తీసుకోలేక కొండవీటి వాగు పొంగిపొర్లింది. ఆ నీరు నంబూరు పొలాల్లోకి చేరి పొలాలను ముంచేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు బ్యాక్ వాటర్ ఈరోజు వరకు పోలేదని అంగీకరించారు. ఆ వరద నీటిని బయటకు పంపించేందుకు విజయవాడ వెస్ట్రన్ బైపాస్ కి ఇప్పుడే 24 మీటర్లు గండికొట్టామని చెప్పారు. దీనికి ప్రధాన కారణం కల్వర్టు బ్లాక్ అయ్యిందని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం దిశగా వెళ్తున్న వెస్ట్రన్ బైపాస్ కల్వర్టు బ్లాక్ అయ్యిందని మంత్రి చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. ఖచ్చితంగా ఈ ఉప వాగులను మూసేయడం, డైవర్ట్ చేయడం వల్ల, కొండవీటి వాగుని వెడల్పు చేయకపోవడం వల్ల ఈ నీరంతా వారం రోజులైనా నిలిచిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆ కారణంగానే వరద నీరంతా అనధికార ఎగ్జిట్ లు ఖాజా టోల్ గేట్ ని ముంచెత్తింది. వెస్ట్రన్ బైపాస్ గండి కొట్టామని, కృష్ణా నదిలోకి, కృష్ణా వెస్ట్రన్ డెల్టాలోకి నీరు పంప్ చేశామని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. అంటే అధికారికంగా, అనధికారికంగా ఐదు ఎగ్జిట్ల నుంచి వారం రోజులుగా కొండవీటి వాగు ప్రవహించింది. అయినా ఇంకా నీరు పూర్తిగా బయటకు పోలేదు. ఈరోజు గండి కొట్టామని మంత్రి చెప్పిన మాటల కన్నా వేరే నిదర్శనం ఇంకేం అవసరంలేదు. మాపై కేసులు పెట్టి ఏం ప్రయోజనం..? గుంటూరు ఛానెల్లోకి కూడా ఈ వరద నీటిని పంపు చేశారని గత వారం నుంచి మాట్లాడుతున్నాం. దాని కారణంగానే మంగళగిరి, చినకాకాణి, చిలుమూరు, వడ్లమూడి, పొన్నూరులోని నంబూరు, గోళ్లమూడి, తక్కెళ్లపాడు, ఉప్పలపాగు, వెంకటకృష్ణాఫురం గ్రామాల్లో 31 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని చెబుతున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం గుంటూరు ఛానెల్లోకి నీటిని విడుదల చేయలేని చెబుతోంది. లాకులు మూసేసినా కెనాల్లోకి నీరు చేరిందని చెబుతున్నారు. వాస్తవానికి కొండవీటి వాగు, గుంటూరు ఛానెల్ వేర్వేరు కాదు. కొండవీటి వాగు పంపింగ్ ఇన్టేక్ లోనుంచి గుంటూరు ఛానెల్ ప్రారంభమవుతుంది. కొండవీటి వాగులో నీరుంటే నేరుగా గుంటూరు ఛానెల్ లోకి, లేనప్పుడు కృష్ణ లోనుంచి గ్రావిటీ మీద గుంటూరు ఛానెల్లోకి వస్తుంది. 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నీరు ప్రవహించి పొలాలను ముంచేసిందని నేను వాదిస్తుంటే నా మీద అవినాశ్ అనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్తో తాడేపల్లిలో కేసు పెట్టించారు. వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థను సక్రమ మార్గంలో పెట్టుకోకుండా కేసులు పెట్టి భయపెట్టాలనుకోవడం సరైన విధానం కాదు. సరైన నీటి మార్గం లేకుండా రాజధానిలో నిర్మాణాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఈ కారణంగానే రాజధాని ప్రాంతంలో భవనాలన్నీ మునిగిపోయిన పరిస్థితి ఎదురైంది. నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీని 10 అడుగుల ఎత్తులో కట్టడం వల్ల అది మాత్రం ముంపుకి గురికాలేదు. ఇకనైనా మూసిన నాలాలకు పరిష్కారం కనుక్కోవాలి. కొండవీటి వాగుని వెడల్పు చేసిన తర్వాతనే నిర్మాణాలు చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వానికి సూచిస్తున్నా. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దకుండా కాయకల్ప చికిత్సలతో పంటలను ముంచి రైతులకు నష్టం చేస్తుంటే వైయస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నా. ఒరిజనల్ కాంటూర్ లెవల్స్ ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఏమేం మార్పులు చేసింది.. కొండవీటి వాగు విజన్ డాక్యుమెంట్ ఏంటి, ఈరోజు వరకు ఎంతమేర నిర్మించారు వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రకటించాలి. డైవర్షన్లు ఒకసారి చూపించి ప్రభుత్వం తప్పిదం లేదని నిరూపించుకోవాలి. అంతేకానీ నిజాలు దాటి మీడియా ముందు బుకాయించడం, కేసులు పెట్టి భయపెట్టాలనుకోవడం సరైన విధానం కాదు. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది కనుక వీటికి ఎవరూ భయపడే పరిస్థితి ఉండదని అంబటి మురళి హెచ్చరించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల పక్షాన ప్రశ్నిస్తున్నాం : డైమండ్ బాబు అమరావతి రాజధానికి ముంపు భయం పొంచి ఉందన్న వాస్తవాన్ని వివరించలేక, చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ మీదకు నెడుతున్నాడు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధాన్ని నిజంగా, నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించాలని చూస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. కానీ నిర్మాణం విషయంలో తలెత్తే సమస్యలు, లోపాలు, జరుగుతున్న అవినీతి గురించి మాత్రమే ప్రజల తరఫున ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాన్ని నమ్ముకుని భూములిచ్చిన 28 వేల మంది రైతు కుటుంబాల పక్షాన వారికి మంచి ప్లాట్లు అభివృద్ధి చేసివ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాటిని కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య. అమరావతి ముంపు సమస్యపై జీఎన్రావు కమిటీ, బోస్టన్ కమిటీతోపాటు వరల్డ్ బ్యాంకు కూడా చంద్రబాబుని హెచ్చరించాయి. కొండవీటి వాగు ముంపు సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్మాణాలు చేయొద్దని సూచించినా చంద్రబాబు మూర్ఖంగా ముందుకెళితే ఇన్వెస్టర్లు రావడానికి ఇష్టపడరని హెచ్చరించారు. ఇవన్నీ పక్కనపెట్టి నిజాలను బయటపెడుతున్న వైయస్ఆర్సీపీ, సాక్షి మీడియా మీద నిందలు మోపడం ప్రభుత్వ చేతకానతనానికి నిదర్శనం. లోపాలన్నీ బయటపడ్డాక కూడా ఇంకా ఇన్వెస్టర్లను, ప్రజలను మోసం చేయాలనుకోవడం, పొలాలు ముంపునకు గురవుతున్నా రైతులను ఏమార్చాలనుకోవడం క్షమించరాని నేరం. కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా వైయస్ఆర్సీపీ గ్రాఫిక్స్ చేసి చూపిస్తుందని అని చెప్పడం ప్రజలను మోసగించడమే. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడిన వీడియోని కూడా ప్రదర్శిస్తున్నాం. ఇప్పటికైనా మాయమాటలు చెప్పడం మానేసి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.