

















ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి ప్రశ్న
వైయస్ఆర్ జిల్లా : స్వయంగా శ్రీరాముడు తన బాణంతో గండి ఆంజనేయ స్వామి ప్రతిమను మొలిచాడని, సజీవంగా ఉన్న ఆంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం కోసం శ్రావణమాసంలో లక్షల్లో భక్తులు వస్తుంటారని వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి తెలిపారు. ఇంతటి గొప్ప ఆలయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. గురువారం గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామిని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గండి నూతన ఆలయ పునః నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `గండి చైర్మన్ , స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించాం. వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ. 28 కోట్లు మంజూరు చేసి 95 శాతం పనులు పూర్తి చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన మిగిలిన ఐదు శాతం పనులను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా..ఆయన కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. గత నాలుగు శ్రావణమాసాల నుంచి భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించడం లేదు.
పూర్తయిన ఆలయాన్ని ప్రారంభించి మూలవిరాట్ విగ్రహ ప్రతిష్ట చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్. మహా కుంభాభిషేకం చేయడానికి మరో రూ.10 కోట్లు అవసరం ఉంటుంది. ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్ను కోరిన స్పందించడం లేదు. వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే సీజీఎఫ్ గ్రాంట్ కింద రూ.28 కోట్లు ఇచ్చిందని, ఇక ఇచ్చే ప్రసక్తి ఉండదనీ, ఆలయానికి వచ్చే ఆదాయంతో పూర్తిచేసుకోండని కూటమి ప్రభుత్వం చెప్తుంది. భక్తులు కానుకలు ఇవ్వాలంటే విగ్రహ ప్రతిష్ట జరిగి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండాలి కదా?. ఎక్కడ ప్రస్తుతమున్న పాలకమండలి సభ్యులకు మంచి పేరు వస్తుందోనని కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. వచ్చే శ్రావణమాసంలోపు విగ్రహ ప్రతిష్టను పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి` అని ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి కోరారు.