విశాఖ : రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాట తీస్తానని అన్నారు. కిరణ్ రాయల్ తాట ఎప్పుడు తీస్తారని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతలు చేస్తున్న దారుణాలపై వరుదు కళ్యాణి బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రతి రోజు మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. జనసేన నేత కిరణ్ రాయల్ వల్ల లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగింది. లక్ష్మికి న్యాయం జరిగిందా. మహిళకు అన్యాయం జరిగితే తాట తీస్తామని పవన్ చెప్పారు. లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగితే ఏమి చేశారు. తిరిగి బాధితులు మీద కేసులు పెడుతున్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొలి ఆరునెలల పాలనలో వైయస్ఆర్ సీపీపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడానికే కేటాయించారు. రాష్ట్రంలో ఒక అరాచక విధానంకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రిటైర్ అయిన పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారి సలహాలతో పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించారు. కులం పేరుతో వ్యక్తిగత దూషణలకు పాల్పడే ఏబీ వెంకటేశ్వరరావు వంటి వ్యక్తి కనుసన్నల్లో పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు. చంద్రబాబు చేతికి ప్రజలు అధికారం ఇస్తే, ఆయన తన కొడుకు లోకేష్ చేతుల్లో మొత్తం పెత్తనాన్ని అప్పగించారు. పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి పోలీస్ వ్యవస్థను లోకేష్ తన చెప్పు చేతల్లోకి తీసుకున్నాడు. లోకేష్ను చూస్తే యథా పిత, తథా సుత అన్నట్టుంది. తండ్రి నుంచి అవినీతి, అరాచకాలను పుణికి పుచ్చుకున్నాడు. ఇప్పటికైనా లోకేష్ను చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలి. ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్న కూటమి ప్రభుత్వం కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ముచ్చుమర్రిలో బాలిక మీద అత్యాచారంతో మొదలు పెట్టి ఇప్పటికి 300 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మహిళల రక్షణ కోసం గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో దిశ చట్టం తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేశారు. తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు అన్యాయం చేసిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. న్యాయం కోసం ఫిర్యాదు చేసిన ఆమెను మాత్రం రాజస్థాన్ నుంచి హడావుడిగా పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించారు. ఇదేనా మహిళలకు భద్రత కల్పించడం. చంద్రబాబుకి ప్రజలంటే గౌరవం, ప్రేమ లేవు. అధకారంలోకి వచ్చినప్పుడు ఏనాడూ మేనిఫెస్టోను అమలు చేసిన పాపాన పోలేదు. ఎల్లో మీడియా కారణంగా చంద్రబాబు బతుకుతుంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు కూడా ఎల్లో మీడియాను బతికిస్తున్నాడు. మనిషై పుట్టిన తరువాత ఒక్కసారైనా మాట మీద నిలబడాలి. మాట కోసం నిలబడ్డారు కాబట్టే ఎన్టీఆర్, వైయస్ఆర్, నేడు వైయస్ జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాధించుకున్నారు. చంద్రబాబు చేస్తున్నది రాజకీయం కాదు.. బ్రోకరిజం. ప్రతి ఒక్కరి దగ్గరా సాగిలపడటం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం రాజకీయమా? ఏ రాజ్యంలోనైనా మహిళలు స్వేచ్ఛ లేక కన్నీళ్లు పెట్టుకుంటే, ఆ పాలకుడు సర్వ నాశనం అయిపోతాడు. అక్కడ నాగరికత అభివృద్ది చెందదు అని గాంధీజీ చెప్పారు. ఆడపిల్లలకు కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి కూడా ఆఖరి రోజులొచ్చేశాయి. డైవర్షన్ పాలిటిక్స్తో ఎల్లకాలం ప్రభుత్వాన్ని నడపలేరు. చంద్రబాబుకి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి. చంద్రబాబుని ప్రజలు దారుణంగా ఓడించడం ఖాయం. చంద్రబాబు జీవితం అబద్దాల మయం ఇన్నాళ్లు కుట్రలు, కుతంత్రాలతో గడిపిన చంద్రబాబు, జీవిత చరమాంకంలో ఉన్నప్పుడైనా మంచి పనులు చేయాలి. లేదంటే చంద్రబాబును గురించి ప్రజలు కనీసం తలుచుకోరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదు. 1995లో నా మీద మొదలు పెట్టి, ఇప్పుడు వైఎస్ జగన్ గారి వరకు ఆయన జీవితమంతా అబద్ధాలు, ఆరోపణలు చేయడం మీదనే నడుస్తోంది. అబద్ధాల కోటలోనే చంద్రబాబు జీవిస్తున్నాడు. ఆఖరుకి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూపైన కూడా దారుణంగా తెగించి చెప్పిన అబద్ధానికి ఇక్కడ సమాధానం చెప్పుకోకపోయినా పైన భగవంతుడి ముందు చంద్రబాబు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందేనని లక్ష్మీ పార్వతి అన్నారు. మహిళల వేదన అరణ్య రోదనగా మారింది రాష్ట్రంలో మహిళల వేదన అరణ్య రోదనగా మారిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుసగా జరుగుతున్న దారుణాలే దీనికి నిదర్శనం అని మండిపడ్డారు. హోంమంత్రి సొంత జిల్లా విశాఖలోనే ఇప్పటి వరకు 20 మందిపై అత్యాచారాలు జరిగాయంటే రాష్ట్రంలో మహిళా భద్రతకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆమెకు చీమకుట్టినట్టయినా లేదు. మహిళలకు అన్యాయం చేస్తే తాటతీస్తా, తొక్కి పెట్టి నార తీస్తానన్న కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఆడబిడ్డకు అన్యాయం చేస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పిన చంద్రబాబు మహిళల భద్రత గురించి ఈ 9 నెలల్లో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ విఫలమైందనే విషయం సాక్షాత్తు సీఎం పోలీస్ వ్యవస్థపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. 20 శాఖల మీద సీఎం చంద్రబాబు నిర్వహించిన సర్వేలో పోలీస్ శాఖ 18వ స్థానానికి పడిపోయిందంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంటుందా? దీన్ని బట్టి శాంతి భద్రతల విభాగాన్ని చూసే ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ విఫలమైనట్టే. పోలీస్ వ్యవస్థను శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి వాడుకోవడం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొంది. మహిళను మోసగించిన కిరణ్ రాయల్పై చర్యలేవి? తిరుపతిలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వేధింపులకు లక్ష్మి అనే మహిళ బలైంది. తనను మోసగించడంతో పాటు కోటిన్నర నగదు, 25 తులాల బంగారం తీసుకుని ఇవ్వకుండా వేధించాడని గోడును వెళ్లబోసుకున్నా కూటమి నాయకులు ఆమెకు న్యాయం చేయలేదు. ఆమె ధైర్యం చేసి కేసు పెట్టినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, విచారణ లేదు. పైగా ఆమెపైనే కేసులు పెట్టి జైలు పాలుజేశారు. ఎక్కడైనా బాధితులు కేసులు పెడితే నిందితుల మీద చర్యలు తీసుకుంటారు. కానీ ఏపీలో మాత్రం పూర్తి విరుద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన నడుస్తోంది. బాధితులపైన నిందితులే కేసులు పెట్టి వేధిస్తున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను వేధిస్తే.. ఇక్కడ న్యాయం జరగదని భావించి కర్నాటకలో కేసు నమోదు చేసింది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులకు ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ను దారుణంగా దూషించారు. ఈ వరుస ఘటనల్లో నో పోలీస్...నో కేస్... ఏ ఒక్కరికీ శిక్షపడకుండా బాధితులనే వేధించడం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి, హోంమంత్రి అనితకి రాష్ట్రంలో మహిళలంటే ఇంత చులకనభావనా అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.