బీసీలను పట్టిపీడిస్తున్న శని చంద్రబాబు

బలహీనవర్గాలకు తెలుగుదేశం పార్టీ చేసింది శూన్యం

9 నెలల పాలనలోనే బీసీలకు మేలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

తాడేపల్లి: బలహీనవర్గాలను పట్టిపీడిస్తున్న శనిలా చంద్రబాబు తయారయ్యాడని వైయస్‌ఆర్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. చంద్రబాబు అనే శనిని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు వదిలించుకున్నారు. అయినా చంద్రబాబు అనే శని బీసీలను వదలడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే టీడీపీ వాడుకుందని, బలహీనవర్గాల కోసం చేసింది శూన్యమన్నారు. బీసీలకు చేసిన మేలుపై చర్చకు వచ్చే దమ్ము చంద్రబాబు, టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలను తొమ్మిది నెలల పాలనలోనే తూచా తప్పకుండా అమలు చేశారన్నారు. సీఎంను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘సీఎం వైయస్‌ జగన్‌ బీసీలను మోసం చేస్తున్నారు.. అన్యాయం చేస్తున్నారు.. అని చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీలు అన్ని విధాలుగా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు బీసీలకు మోసం చేస్తూనే ఉన్నాడు. 2014లో బీసీ డిక్లరేషన్‌లో నామినేటెడ్‌ పదవుల్లో మూడో వంతు బలహీనవర్గాలకు ఇస్తామని మాట తప్పాడు. దాదాపు 120 హామీలు బీసీలకు ఇచ్చి ఏ ఒక్క అంశాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. రూ.10 వేల కోట్లతో బీసీ ఉపప్రణాళిక, వైస్‌ చాన్స్‌లర్లలో కూడా మూడో వంతు పదవులు, సామాజిక మార్పులు అని చెప్పి కులాల మధ్య బాబు తగాదాలు పెట్టాడు.

సీఎం వైయస్‌ జగన్‌ సర్కార్‌ తొమ్మిది నెలల కాలంలోనే ఏలూరులో బీసీ గర్జనలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేశారు. 50 శాతం నామినేటెడ్‌ పదవుల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించేందుకు చట్టం చేశారు. బీసీ వర్గాలను ఆదుకోవాలని ఏనాడైనా చంద్రబాబు ఆలోచించాడా అని ప్రశ్నిస్తున్నా.

2018 సెప్టెంబర్‌లో పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన డిప్యూటీ సెక్రటరీ ద్వారా హైకోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలు చేయించాడు. 50 శాతానికిపైగా రిజర్వేషన్‌ పెంచడానికి వీల్లేదని, కాబట్టి రిజర్వేషన్‌ కొనసాగించకుండా ఎన్నికలు పొడిగించాలని ఎన్నికలు జరగకుండా చేశాడు. బీసీల జనగణన పూర్తి కూడా చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మేలు కోసం సీఎం వైయస్‌ జగన్‌ 59.85 శాతం రిజర్వేషన్‌ తీసుకొస్తే దాన్ని అడ్డుకున్నారు. బీసీలంతా వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించారనే టీడీపీ సుప్రీం కోర్టులో బిర్రు ప్రతాప్‌రెడ్డితో పిటీషన్‌ వేయించింది. ప్రతాప్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తే. బీసీలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే అచ్చెన్నాయుడు, నారాయణ, రామ్మోహన్‌రావులు చంద్రబాబును ప్రశ్నించాలి. సీఎం వైయస్‌ జగన్‌ను ప్రశ్నించే అర్హత టీడీపీలోని బీసీలకు, చంద్రబాబుకు లేదు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం, రిజర్వేషన్లు పెంచడమే అన్యాయమా..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మార్కెట్‌ కమిటీ చైర్మన్లను చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. సీఎం వైయస్‌ జగన్‌ తొమ్మిది నెలల పాలన, 40 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎవరు బీసీలకు మేలు చేశారని చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబు, టీడీపీ నేతలకు ఉందా..?

 

Back to Top