అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉండేది రెండే పక్షాలని, ప్రతిపక్ష హోదా వైయస్ఆర్సీపీ హక్కు అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ అని స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష హోదా వైయస్ఆర్సీపీకి హక్కు, అయితే టీడీపీ తెలుగు దొంగల పార్టీగా మారి ప్రజలను, దేవుళ్లను మోసం చేస్తోందని విమర్శించారు. పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పచ్చ పార్టీ గూండాలు పెట్రోల్ బాంబులు వేస్తున్నారని, గత వైయస్ఆర్సీపీ హయాంలో ఇలాంటి సంఘటనలు ఏనాడూ జరగలేదని చెప్పారు. 175 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాల్సిన హక్కు ఉంటుందన్నారు. వైయస్ జగన్కు సభలో మాట్లాడే హక్కు ఉండాల్సిన అవసరం ఉందని, ఈ ప్రభుత్వం నియంత పోకడలు అనుసరిస్తోందని అన్నారు. ఏపీలో 3.2 లక్షల కోట్ల అప్పులు చేసినా , విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష హోదా వైయస్ఆర్సీపీ హక్కు మాత్రమే అని స్పష్టం చేశారు. తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగాన్ని అబద్ధాలతో నింపిన ప్రకటనగా విమర్శించారు. గవర్నర్తోనూ అబద్ధాలు పలికారని, పీఏసీని ప్రభుత్వం స్వయంగా తీసుకున్నదని, ప్రతిపక్ష హోదా ఇవ్వడం మానేసిందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను సభలో చర్చించేవారు ఎవరు? ఈ 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, మూడేళ్ల తర్వాత మళ్లీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.