తూర్పు గోదావరి: భూవివాదంలో జరిగిన ఘటనను రాజకీయ హైడ్రామాగా చిత్రీకరించారని, శ్రీనివాసరెడ్డి కిడ్నాప్ ఫేక్ అని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొల్లలగుంట ఘటనలో టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలు సరికాదని జ్యోతుల చంటిబాబు ఖండించారు. శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్మను లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవమానంతో శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. గొల్లలగుంట వచ్చి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. భూ వివాదానికి సంబంధించి జరిగిన ఘటనను, పంచాయితీ ఎన్నికలకు ముడిపెడుతూ.. దానిని టీడీపీ ఒక రాజకీయ హైడ్రామాకు తెరతీసింది. ఈ ఘటన పై విచారణ జరపాలి అని మేం కూడా కోరుతున్నాం. తెలుగుదేశం హయాంలో పనిచేసిన పోలీస్ ఉద్యోగులే ఇప్పుడు కూడా పని చేస్తున్నారు. ఏ ఘటన జరిగినా, ఎక్కడ ఏ కారణంతో ఎవరు చనిపోయినా దానిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించటం రాజకీయం చేయటం టీడీపీకే చెల్లింది. సమాజంలో అన్ని వ్యవస్థలను తెలుగుదేశం భ్రష్టుపట్టించింది. చంద్రబాబుతో తాను కూడా గతంలో పనిచేశాను కాబట్టి ఆయన కుట్రల గురించి నాకు బాగా తెలుసు. రాజకీయ అవసరానికి తనను వాడుకుని, ఆ తర్వాత ఇబ్బంది పెడితే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నన్ను ఆదరించి, రాజకీయంగా అవకాశాలు కల్పించారు. లోకేష్ నిన్న గొల్లలగుంట వచ్చి.. తన పార్టీ కార్యకర్త గ్రామంలో గొడవల కారణంగా మరణిస్తే.. దానికి సానుభూతి వ్యక్తం చేయాలి గాని, అది చేయకుండా అనవసర రాజకీయ ప్రేలాపనలు చేయడం తగదు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపును అడ్డుకోవడానికే టీడీపీ శవరాజకీయం చేసి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తుంది. టీడీపీ జిమ్మిక్కులు, డ్రామాలన్నీ ప్రజలకు తెలుసు. ఈరోజు పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరచడానికి అభ్యర్థులే కరువవ్వడంతో.. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. నారాలోకేష్ బుద్ధీ, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడ రాజకీయం చేయాలో తెలియక శవరాజకీయం చేస్తున్నారు. గొల్లలగుంటలో శ్రీనివాస రెడ్డి కిడ్నాప్ ఒక ఫేక్.. కిడ్నాప్ నాటకం వలన అవమానం పాలై ఆత్మహత్య చేసుకొంటే దానిని రాజకీయం చేయడం విచారకరం. లోకేష్ రాజ్యంగం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గతంలో వైయస్ఆర్సీపీ నుంచి 23మంది ఎమ్మెల్యే లను తీసుకుపోయి, వారిలో నలుగురిని మంత్రులను చేయడం మరి టి.డి.పి. రాజ్యాంగమా..? అని జ్యోతుల చంటిబాబు ప్రశ్నించారు.