రాజమండ్రి: 40 ఏళ్ల టీడీపీకి రాజ్యసభలో చోటు లేకుండా పోతుంది అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జోస్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ పరిపాలన బీసీలకు సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. మరో నాలుగు రోజుల్లో ఏపీలో కులగణన పూర్తి కాబోతుంది అన్నారు. శెట్టిబలిజలపై చిన్న చూపు అంటూ చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. శెట్టిబలిజలకు 2 సీట్లు ఇస్తే గెలుస్తారా..? అంటూ అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి 8 మంది శెట్టిబలిజలను సీఎం వైయస్ జగన్ చట్టసభలకు పంపించారని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. బీసీల రాజ్యాధికారం కోసం శెట్టిబలిజలు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సీఎం వైయస్ జగన్ ఒక ఆశయంతో ఎన్నికలకు వెళ్తున్నారు. టీడీపీ-జనసేనలు ఆశతో పొత్తుల పెట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.