తిరుపతి: ప్రపంచంలో నియంత అంటే అందరూ కిమ్ను చూపిస్తారు. భారతదేశంలో రాజకీయ శుంఠ, వెన్నుపోటు దారుడు, సొంత నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే చంద్రబాబును చూపించే పరిస్థితి. అది చంద్రబాబు చరిత్ర.. అని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తన దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసినట్టుగా.. కుప్పం ప్రజలను కూడా నాశనం చేయాలని చంద్రబాబు పూనుకున్నాడని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన దౌర్జన్యకాండపై ఆయన ధ్వజమెత్తారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం మాట్లాడారంటే.. ‘‘చంద్రబాబు కుప్పం పర్యటనకు ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చాడో అన్ని సార్లు అక్కడ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 30 ఏళ్లు క్యాబినెట్ హోదాలో ఉండి అనేక పదవులు అనుభవించి కుప్పంలో పలానా పనిచేశానని కుప్పం ప్రజలకు చెప్పుకునే పరిస్థితి లేక అడ్డగోలు మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇళ్ల నిర్మాణం చూసి ఓర్చుకోలేక ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. తన పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసినట్టు కుప్పం ప్రజలను ఏ విధంగా నాశనం చేయాలని పూనుకున్నాడు. మొదటిరోజు చంద్రబాబు పర్యటన రామకుప్పం మండలం కొల్లుపల్లె అనే గ్రామంలో వైయస్ఆర్ సీపీ కార్యకర్త భయ్యారెడ్డిని ఏ విధంగా దాడిచేశారు అనేది వీడియోలో చూడొచ్చు. ఆ విధంగా వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి చేసి.. మాపైనే నిందలు వేసి.. వైయస్ఆర్ సీపీ దౌర్జన్యం చేసిందని బాబుకు సహకరించే మీడియాలో అభూతకల్పనలు సృషిస్తున్నారు. ప్రతీ మాట రెచ్చగొట్టడమే.. రామచంద్రారెడ్డిని రమ్మనండి.. వైయస్ జగన్మోహన్రెడ్డిని రమ్మనండి అమీతూమీ తేల్చుకుంటాం అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు. ఏం మాట్లాడుతాడో బాబుకే తెలియదు. చంద్రబాబు అభివృద్ధి చేసిఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు. రానురాను చంద్రబాబు అపజయాలను చూసి.. పరిస్థితులన్నీ గమనించి.. కుప్పంలో గెలవలేనని అభిప్రాయానికి వచ్చాడు. అందుకే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఆలోచనతో కుట్రలుచేస్తున్నాడు. కుప్పం పర్యటన మొదటిరోజు వైయస్ఆర్ సీపీ నేత సురేష్రెడ్డి ఇంటిపై దాడి చేశాడు. 33 ఏళ్లలో చంద్రబాబు కుప్పానికి ఎన్నిసార్లు వచ్చాడు. ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చాడు. 33 ఏళ్ల కంటే ఈ మూడేళ్లలోనే 6 సార్లు వచ్చాడు. 15 రోజులు పర్యటన చేశాడు. ఆ పర్యటనలో వైయస్ఆర్ సీపీ నేతలను తిట్టడం, కార్యకర్తలపై దాడులు చేయడం తప్ప ఏమీ లేదు. అందరినీ రెచ్చగొట్టి వైయస్ఆర్ సీపీని భయబ్రాంతులకు గురిచేయాలనే కుట్రతో ఉన్నాడు. దౌర్జన్యంతో గెలవాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రజలంతా చంద్రబాబు గురించి తెలుసుకున్నారు. 30 సంవత్సరాల్లో రాయలసీమకు, చిత్తూరు జిల్లాకు, కుప్పం నియోజకవర్గానికి ఏం చేశాడో ఆలోచన చేస్తే..రాయలసీమకు తీవ్ర నష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే చంద్రబాబు. మూడుసంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీళ్లు ఇవ్వలేదు.. గాలేరు నగరి కాల్వ మొదలుపెట్టలేదు. హంద్రీనీవా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పూర్తిచేయలేదని మాట్లాడుతున్నాడు. ఆ కాంట్రాక్టర్ చంద్రబాబుకు కావాల్సిన వ్యక్తే.. కుప్పం నియోజకవర్గానికి తాగునీరు ఇస్తాం అని చెప్పాం. కాంట్రాక్టర్తో కుమ్మకైన చంద్రబాబు రాజకీయ కుట్రగా హంద్రీనీవా ఆపుతున్నారు. గాలేరు నగరి పనులు నిలిపేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ను రద్దు చేయడం జరిగింది. తప్పకుండా వేరే వ్యక్తులకు ఇచ్చి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తిచేసే ఎన్నికలకు వెళ్తాం. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చిన్న బ్రాంచ్ కెనాల్ కూడా పూర్తిచేయలేకపోయాడంటే.. కుప్పం మీద ఎంత ప్రేమ ఉందో చెప్పొచ్చు. ఏదైనా ఫలానా పనిచేస్తాను.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవి చేశాను.. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తానని ఎవరైనా చెబుతారు. కానీ, చంద్రబాబు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. సీఎం వైయస్ జగన్కు, నాకు కొత్త పేర్లు పెట్టి శునకానందం పొందుతున్నాడు. ఆయనకు కావాల్సిన టీవీ ఛానళ్లు, పత్రికలు సంతోషపడుతున్నాయి. చంద్రబాబు మూడురోజుల పర్యటనలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎంతమంది గాయపడ్డారో మీడియా సాక్షిగా చూపించాం. టీడీపీ కార్యకర్తలకు చిన్న గాయాలైనా అయ్యాయా..? అని చంద్రబాబును అడుగుతున్నా. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనన్నలు పొందాలి తప్ప.. దౌర్జన్యకాండతో గెలుస్తావా అని ప్రశ్నిస్తున్నాను. కుప్పంలో అంతా శాంతికాముకులు.. అలాంటి వారి ఇళ్ల మీద రాళ్లు వేయడం, దౌర్జన్యం చేయడం.. అయ్యప్ప పూజలు వెళ్లి వచ్చేసరికి బ్యానర్లు అని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మాదిరిగా తయారైందని దుష్ప్రచారాలు చేస్తున్నాడు. తక్కువ రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో ఏపీకి కూడా ఒకటని కేంద్రం ప్రకటించింది. ఇవన్నీ చంద్రబాబుకు కనిపించడం లేదు. రాజకీయ శుంఠ, వెన్నుపోటు దారుడు, నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే చంద్రబాబును చూపించే పరిస్థితి. అది చంద్రబాబు చరిత్ర’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.