విజయవాడ: ఏడాదిన్నర పాలనలోనే మేనిఫెస్టోలోని హామీలను 90 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు. బాబు మాయ మాటలు విని ప్రజలు మోసపోయారన్నారు. సీఎం వైయస్ జగన్తో పోల్చడానికి కూడా చంద్రబాబు సరిపోడన్నారు. మంచి విద్య, వైద్యం అందించేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.
పోలవరం పూర్తిచేస్తామని టీడీపీ ప్రగల్భాలు పలికిందని, పోలవరం పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు అండ్ కో దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. పోలవరంతో పాటు రాయలసీమకు నీరందించేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని, రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక అసమానత వస్తుందని అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.