ప్రతి గింజను కొంటాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నాం

ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించాం

ఇప్పటి వరకు 2,36, 880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం

తాడేపల్లి: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి గింజను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఇప్పటికే 7 వేలకు పైగా ఆర్‌బీకే కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. శనివారం మంత్రి కన్నబాబు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే ఇవాళ ధాన్యాన్ని, ఇతర పంటలను కొనుగోలు చేస్తున్నాం.ఆర్‌బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించాం. ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించాం. రైతు పంట అమ్ముకోవాలంటే ఆర్‌బీకేలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే..కొనుగోలు కార్యక్రమంతా అక్కడే జరుగుతుంది. 21 రోజుల్లో డబ్బులు అందజేస్తున్నాం. ఎంఎస్‌పీ కచ్చితంగా కల్పిస్తున్నాం. దురదృష్టం ఏమిటంటే అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా తీవ్రమైన నష్టం జరిగింది. దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తోంది.  ఇప్పటి వరకు వర్షాల కారణంగా ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఎంఎస్‌పీ ప్రకారం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉంటే మొల విరిగిపోతుంది. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. 

ఇప్పటి వరకు 2,36,880  టన్నులు కొనుగోలు చేశాం. ఇప్పుడే ధాన్యం పెరుగుతోంది. కోతలు పూర్తి అయ్యే సరికి ఇంకా ఎక్కువగా వస్తుంది. 7681 ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయాలని మ్యాపింగ్‌ చేశాం. ఇప్పటికే 2.36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. వచ్చింది వచ్చినట్లు కొనుగోలు చేస్తూ..ప్రతి ఆర్‌బీకేకు మిల్లులను అనుసంధానం చేశాం. 

ఇది కాకుండా ఎఫెక్టెడ్‌ ఏరియాలను దృష్టిలో పెట్టుకొని..ఎక్కడైతే వరికి నష్టం వాటిల్లిందో మ్యాపింగ్‌ చేయమని ఆదేశాలు జారీ చేశాం. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించాం. దాదాపు 7 లక్షల టన్నులు తగ్గుందని అంచనా వేస్తున్నాం. వరి, బియ్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించాం. నూకల శాతాన్ని ఇంకా ఎక్కువగా అనుమతించాలని జిల్లాల వారీగా డేటాను కేంద్రానికి పంపించామని మంత్రి కన్నబాబు తెలిపారు.
 

Back to Top