పచ్చనేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తోంది

చంద్రబాబు తానా అంటే పవన్‌ కళ్యాణ్‌ తందానా 

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు దుష్ప్రచారం 

 మంత్రి బొత్స సత్యనారాయణ  

విజయనగరం: పచ్చ నేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగానే ఉన్నాయి. పచ్చనేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తోంది. చంద్రబాబు గంటగంటకీ మీడియాలో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగటం లేదని, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దానితో పోలిస్తే నూటికి 99 శాతం బ్రహ్మాండంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతోంది.  రాష్ట్రంలో 9676 ఎంపీటీసీ స్థానాలకు సుమారు 50 వేల మంది నామినేషన్లు వేశారు. 652 జడ్పీటీసీ స్థానాలు ఉంటే సుమారు 1500 మంది నామినేషన్లు వేశారు.  ఎన్నికలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.. చిన్న చిన్న ఘటనలను కూడా చూపి చంద్రబాబు లబ్ధి పొందాలని అనుకుంటున్నారు.  చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టి శాంతిభద్రతలు విఘాతం కల్గిస్తున్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. చంద్రబాబుకు విలువలు, సిద్ధాంతాలు లేవు. ఇప్పటికే చాలా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్‌ లు ఏకగ్రీవం వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీకి పట్టం కట్టడం ఖాయం.  గత ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా పాలిస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయి. వైయస్‌ జగన్‌ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.   రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సీఎం  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. మాచర్ల సంఘటనకు కారణం ఏంటి?  బోండా ఉమా, బుద్ధా వెంకన్న అక్కడకు ఎందుకు వెళ్లారు. ఇద్దరూ పది కార్లలో వెళ్లారు. -మందీమార్భలాన్ని వేసుకొని వెళ్లారు. అక్కడ ఒక వికలాంగుడ్ని గుద్దారు. ఆపి వైద్యానికి పంపకుండా వారిపై కలబడి దూషించి ముందుకు వెళ్తే ఏ ప్రజలు ఊరుకుంటారో చెప్పాలి. చంద్రబాబు తానా అంటే పవన్‌ కళ్యాణ్‌ తందానా అంటున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే టీడీపీకి నామరూపాలు లేకుండా పోతాయని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.
 

Back to Top