గుంటూరు: కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా పరీక్షల కోసం రాష్ట్రంలో 4 ల్యాబ్లు పని చేస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గుంటూరు, వైజాగ్, కడపలో అదనంగా కొత్తగా ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో మంత్రి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 332 కరోనా వైరస్ సాంపిల్స్ను ల్యాబ్కు పంపించామని, 289 నెగిటివ్ రిపోర్టులు రాగా మరో 33 రిపోర్టులు రావాల్సి ఉందని వెల్లడించారు. గుంటూరులో నమోదైన మొదటి కరోనా పాజిటివ్ కేసు వ్యక్తి బంధువులైన అయిదుగురిని అనుమానంతో ఆసుపత్రి తరలించామని మంత్రి తెలిపారు. ఆ వ్యక్తి ప్రయాణించిన 16 మంది తోటి ప్రయాణికులను, దగ్గరగా తిరిగిన మరో 13 మందిని వారి హౌస్ క్వారంటైన్కి తరలించామన్నారు. ప్రజల సహకారం అవసరం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్కు ప్రజలు సహకారాన్ని అందించాలని, ప్రజల సహకారంతోనే కరోనా నిర్మూలన చేయగలమని ఆళ్లనాని అన్నారు. గుంటూరులో అదనంగా 14 రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక 60 ఏళ్లు దాటివ వారెవరూ బయటకు రావద్దని సూచించారు. వచ్చే నెల రేషన్ను 29 తేదినే ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.