కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి స్పూర్తితో కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య పేర్కొన్నారు.శనివారం 37వ వార్డులోని వీకర్ సెక్షన్ కాలనీలో ప్రభుత్వ, నగర పాలక సంస్థ సాధారణ నిధులు రూ.1.20 కోట్లతో నిర్మించిన వైయస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు , బి.వై. రామయ్య , ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , కమిషనర్ డి.కే. బాలాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ బి.వై. రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాగైతే పనిలో చిత్తశుద్ధి చూపిస్తున్నారో అలాగే నగర అభివృద్ధిలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా పనులు సకాలంలో పూర్తి చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో నగర దశదిశ మారే విధంగా ఎన్నో సమగ్ర ప్రణాళికలు సిద్ధం ఉన్నాయని ఆ దిశగా నగర పాలక సంస్థ అడుగులు వేస్తోందన్నారు. ఏడాదిలోపే 50 వేల మొక్కలు, గార్బేజ్ పాయింట్ల తొలగింపు, ప్లాస్టిక్ పై ఉక్కుపాదం, నీటి సమస్య పరిష్కారానికి సమస్యకు 82 కోట్లతో పైపులైన్ వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలకు నాంది పలికామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కోవిడ్ సమయంలో ఉచిత వ్యాక్సిన్, హెల్త్ సెక్రటరీలు, కరోనా కిట్స్, ఆసుపత్రుల ఆధునికరణలు, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్యం, వైద్య విభాగంలో వెంటవెంటనే నియామకాలు వంటి ఎన్నో పథకాలతో సిఎం దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. తాజాగా యూ.హెచ్.సి.లతో ప్రజలకు వారి ఇంటికి సమీపంలో వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ అయిషా సిద్దిఖా, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్వేతరెడ్డి, డి.ఎం.హెచ్.ఓ రామగిడ్డయ్య, కార్పొరేటర్ విక్రమసింహా రెడ్డి, ఎం.ఈ.లు శేషసాయి, సురేంద్ర బాబు, డిఈఈ రాజశేఖర్, ఏఈ హిమబిందు, కృష్ణలత తదితరులు పాల్గొన్నారు.