శాసనమండలి: రాష్ట్రంలో 18 వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాని సమాధానం ఇచ్చారు. సివిల్ సప్లయ్ ద్వారా పేదలకు పంచే బియ్యాన్ని గతంలో సార్టెక్స్ చేసేవారు కాదు.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా సార్టెక్స్ చేసి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం వైయస్ జగన్ చెప్పారన్నారు. సార్టెక్స్ మిల్లులు ఎన్ని ఉన్నాయని విచారణ చేస్తే దాదాపు 900 ఉన్నాయని, 700 నాన్ సార్టెక్స్ మిల్లులు ఉన్నాయని తేలిందన్నారు. అయితే కొనుగోలు చేసిన ధాన్యంలో 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందజేస్తాం.. మిగిలిన 30 లక్షల టన్నులు ఎఫ్సీఐ ద్వారా కేంద్రానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. తినేందుకు అనువుగా ఉన్న బీపీటీ 5201 సంబామసూరి ఏ గ్రేడ్, బీపీటీ 3291 సోనామసూరి , బీపీటీ 2231 అక్షయ, ఎన్టీయూ1010 కాటన్దొర సన్నలు, 1061 ఎంటీయూ ఇంద్ర, ఎన్టీయూ 1064 అమర, ఎన్టీయూ 1156 తరంగిణి, అదే విధంగా నెల్లూరు ఎన్ఎల్ఆర్ 344449 నెల్లూరు మసూరి, ఆర్జీఎల్ 2537 శ్రీకాకుళం సన్నలు ఇవన్నీ ఏగ్రేడ్. అదేవిధంగా సాధారణ రకం అంటే ఎంటీయూ 7029 స్వర్ణ, ఎంటీయూ 1121, ఎంటీయూ 1075 ఇవన్నీ సాధారణమన్నారు. వీటిల్లో తినేందుకు వీలున్న వాటిని సార్టెక్స్ మిల్లులకు పంపించి ఇంతకు ముందు కేంద్ర నియమాల ప్రకారం 25 శాతం బ్రోకెన్స్ ఉండేది.. దాన్ని 15కు తగ్గించి ఒకే కలర్ ఉండేలా సార్టెక్స్ చేయాల్సి ఉంటుంది. ప్రజా పంపిణీకి వాడే ధాన్యాన్ని సార్టెక్స్ మిల్లులకు, కేంద్రానికి పంపించే ధాన్యాన్ని నాన్సార్టెక్స్ మిల్లులకు పంపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారు అమ్ముకోలేని వెరైటీలు ఉంటే వాటిని ప్రభుత్వమే ఆఖరి ధాన్యపు గింజవరకు కొనే ఏర్పాటు చేయడం.. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించడం చేస్తున్నామన్నారు. దళారుల వ్యవస్థను పూర్తిగా అరికడుతున్నామన్నారు. Read Also: లోకేష్కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధ