చంద్ర‌బాబును కాపాడేందుకే ఢిల్లీకి పురందేశ్వ‌రి

నేరం చేయలేదు అని చంద్రబాబు అండ్‌ కో.. చెప్పటం లేదు.

దొరికిపోయిన దొంగను..రాచమర్యాదలతో అరెస్టు చేయలేదన్నదే వారి వాదన

చట్టంలోని లొసుగులను చూపి తప్పించుకోవాలని చూస్తున్నారు 

ఎన్ని కోర్టులు తిరిగినా బెయిల్, క్వాష్‌ రాలేదంటే కేసులో బలముందనే అర్థం

కాంగ్రెస్‌ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా మరిదిని కాపాడటమే పురంధేశ్వరి ఎజెండా

బీజేపీలో టీడీపీని విలీనం చేయటానికి కూడా సిద్ధమని పురంధేశ్వరి రాయబారం

ఆయన పీకే కాదు.. కేకే..అంటే కిరాయి కోటి గాడు

దత్తపుత్రుడు టీడీపీ కోసమే రాజకీయ పార్టీ పెట్టాడు.

బాబు అరెస్టై జైళ్లో ఉన్నాడు...లోకేశ్ ఢిల్లీ ఓపెన్ జైళ్లో ఉన్నాడు

ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ధ్వ‌జం

తాడేప‌ల్లి: సీఐడీ అధికారులు అన్ని ఆధారాల‌తోనే చంద్ర‌బాబును అరెస్టు చేశార‌ని, దొంగ అన్ని సార్లు త‌ప్పించుకోలేడ‌ని చంద్ర‌బాబు విష‌యంలో రుజువైంద‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. స్కిల్ స్కామ్‌లో టెక్నిక‌ల్ అంశాల‌పైనే చంద్ర‌బాబు లాయ‌ర్లు వాద‌న‌లు వినిపిస్తున్నారు త‌ప్ప నేరం చేయ‌లేద‌ని చెప్ప‌డం లేద‌న్నారు. గ‌తంలోనే అనేక‌సార్లు విచార‌ణ‌ల నుంచి చంద్ర‌బాబు త‌ప్పించుకున్నాడ‌ని, ఇప్పుడూ చ‌ట్టంలో లొసుగులున్నాయా అని చంద్ర‌బాబు వెతుకులాడుతున్నాడ‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి రాంబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దొంగ‌లు దొరికిపోయార‌ని ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిపోయింద‌న్నారు. చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడ‌ని, స్కామ్‌ చేయలేదని చెప్పలేకపోతున్నాడ‌న్నారు.

మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..

స్కిల్‌ స్కాంలో నారా చంద్రబాబునాయుడు రిమాండ్‌కు వెళ్లిన క్షణం నుంచి టీడీపీ, వారి ఎల్లో మీడియా రాతలు, వాదనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.వారి వాదనలు విని విచిత్రం అనిపిస్తోంది..ఏమిటా ఇంత బరితెగించారు అనిపిస్తోంది. ఈ స్కాం బయటకు వచ్చినప్పటి నుంచీ వాళ్లు చంద్రబాబు నేరస్థుడు కాదు అని మాత్రం వాదించడం లేదు. పీసీ యాక్ట్‌ 17ఏ ప్రకారం అరెస్టు జరగలేదు అంటారు. మా బాబుని గవర్నర్‌ పర్మిషన్‌ తీసుకుని అరెస్ట్‌ చేయలేదు అంటారు. మా బాబుకి రాచమర్యాదలు చేయడం లేదంటూ బాధపడుతున్నారు. మేం ఏ చట్టం ముందైనా, విచారణకైనా నిలబడతాం అనే ధైర్యం మాత్రం చేయడం లేదు. ఏకాడికి చట్టానికి ఏదో ఒక రంధ్రం చేసుకుని పారిపోవాలి అనేదే ఈ 32 రోజులుగా కన్పిస్తోంది. నేరం చేయలేదు అని మాత్రం చెప్పడం లేదు. దొరికిన దొంగను వారు కోరుకున్న మర్యాదలతో అరెస్టు చేయలేదు కాబట్టి ఈ అరెస్టు చెల్లదు అంటున్నారు. ఈ స్కిల్‌ స్కాంలో మా బాబుకు సంబంధం లేదని కానీ, మా ప్రభుత్వంలో ఈ స్కాం జరగలేదు అనే వాదన మాత్రం చేయడం లేదు. ఆత్మవిశ్వాసం లేనప్పుడు, నేరం చేసినప్పుడు ఏ రంద్రం చేసుకుని పారిపోదామా అనే ఆలోచిస్తారు. విచారణ జరిగితే తమ బండారం అంతా బయటపడుతుందని అనే భయంతో విచారణకు సిద్ధంగా లేరు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టులో కూడా అదే వాదన చేస్తున్నారు. అలాంటి స్కాం జరగలేదు అని వాదించడం లేదు అంటే పచ్చి దొంగలు దొరికిపోయారు అనేది స్పష్టంగా ప్రజలకు అర్ధం అవుతోంది. 

లొసుగులు వెతుక్కుంటున్నారు..
ఇన్‌కం టాక్స్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు. ఆ సంస్థ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు రూ.120 కోట్లు మీ పీఏ ద్వారా లంచం తీసుకున్నారనే సమాచారం మా వద్ద ఉందని, సమాధానం చెప్పండి అని నోటీసులు ఇచ్చింది. మనోజ్‌వాసుదేవ పార్ధసాని వద్ద నుంచి షాపోర్జీ పల్లంజి డైరెక్టర్‌ నుంచి మీ పీఏ నుంచి మీకు డబ్బు వచ్చింది సమాధానం చెప్పండి అంటే మాట్లాడరు. అసలు మీరు మాకు నోటీసులు ఇవ్వడానికి వీళ్లేదు అంటాడు. మీది సెంట్రల్‌ యూనిట్‌..మాది జూబ్లీహిల్స్‌లోని రీజనల్‌ యూనిట్‌ వాళ్లే మాకు నోటీసులు ఇవ్వాలి అంటాడు. అంటే చట్టానికి రంధ్రం చేసుకోవాలనే తాపత్రయం. ఈ రూ.120 కోట్లకు నాకు సంబంధం లేదని వాదిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వమే నోటీసు ఇచ్చింది. ఆధారాలతో నోటీసు ఇస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదు.  టెక్నికల్‌ పాయింట్స్‌పై వాదిస్తున్నారు అంటే నేరం జరిగిందనేది కామన్‌ మాన్‌కు కూడా తేటతెల్లమవుతోంది. 

చంద్రబాబు ఏనాడూ విచారణకు నిలబడిన దాఖలాలు లేవు
సీమెన్స్‌ కంపెనీ జర్మన్‌ కంపెనీ. మా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఏనాడూ ఒప్పందం చేసుకోలేదు అంటోంది. మీరు రూ.371 కోట్లు పోగొట్టుకున్నారు...దానికి మాకు సంబంధం లేదు. అంతేకాదు...రూ.3000 కోట్ల పెట్టుబడులు మేం పెట్టలేదు. ఎలాంటి సాఫ్ట్‌వేర్, పరికరాలు మా వద్ద నుంచి వెళ్లలేదు అని వారు స్పష్టంగా చెప్పారు. ఇది బోగస్‌ ఎగ్రిమెంట్‌ అని స్పష్టంగా చెప్తే మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా దొరికిపోయిన చంద్రబాబు 17ఏని పట్టుకుని తప్పుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆయనకు కొత్తేమీ కాదు..గతంలో కూడా ఆయన విచారణకు నిలబడిన సందర్భాలు ఎప్పుడూ లేవు. గతంలో ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఆదాయాన్ని మించిన ఆస్తులు విషయంలో కేసు పెట్టారు. ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌ కూడా ఇదే కేసు ఫైల్‌ చేశారు. వైయ‌స్‌ విజయమ్మ  కూడా కేసు ఫైల్‌ చేశారు. అంతెందుకు నేడు టీడీపీలోనే ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయంలో చంద్రబాబుపై కేసు ఫైల్‌ చేశాడు. ఆధారాలతో సహా అవినీతిని కోర్టు ముందు పెడితే టెక్నికల్‌ అంశాలను చూపి మేనేజ్‌ చేసుకుని కొట్టేయించుకున్నాడు. విచారణకు వెళితే దొరికిపోతాడు కాబట్టి విచారణకు రాకుండానే కొట్టేయించుకున్నాడు. ఇది ఆయనకు కొత్త కాదు...అనేక సార్లు విచారణ నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు చట్టాలు పకడ్బందీగా ఉన్నాయి. నేరంలో స్పష్టంగా దొరికిపోయాడు. మరో పక్క ఈడీ ఇదే కేసులో 4గురిని అరెస్టు చేసింది. 1400 మంది సాక్షులను విచారించారు. అనేక డాక్యుమెంట్లు వారి వద్ద ఉన్నాయి. అరెస్టయిన వారు 164 స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. అన్నీ ఆధారాలు తీసుకుని చంద్రబాబు నేరం చేశారనే నిర్ణయానికి వచ్చాకే సీబీసీఐడీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది. ఎన్ని కోర్టులు తిరిగినా బెయిల్, క్వాష్‌ రాలేదంటే కేసు ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవాలి. గతంలో మేనేజ్‌ చేసి అలవాటు పడ్డ దొంగ తప్పుకుని వెళ్లాడు కానీ అన్ని సార్లూ తప్పించుకోలేడు. తాను నేరం చేయలేదనే ధోరణి కన్నా నేరం చేసినా నన్ను రాచమర్యాదలతో అరెస్టు చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాడు. 

రింగ్‌ రోడ్డు స్కాంలో ఇరుక్కున్నాడు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? ఆయన కుమారుడు కూడా మేశాడు. ఆయన ప్రజల్లో గెలవకుండా ఇంట్లో వత్తిడి వల్లో, చంద్రబాబుకు కొడుకు మీద ప్రేమతోనే మంత్రి పదవి ఇచ్చాడు. అలా మంత్రి పదవి ఇస్తే రింగ్‌ రోడ్డు స్కాంలో ఇరుక్కున్నాడు. రింగు రోడ్డులో అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చావు..ఎవరికి లబ్ధి జరిగిందని ప్రశ్నిస్తే చెప్పడు. మీ హెరిటేజ్‌ భూములు అక్కడే ఎందుకు కొన్నారు చెప్పమంటే రింగ్‌ రోడ్డే లేదుగా అంటాడు. అసలు రాజధానే లేదు కదా..అంతా గ్రాఫిక్స్‌ కదా అంటున్నాడు. గ్రాఫిక్స్‌ అయినా చేసింది కుట్రలే కదా..ఎక్కడకు వెళ్తాయి..మీరు కుట్రలు చేసి అలైన్‌మెంట్‌ మార్చి కొంత మందికే లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ పాపం పప్పు  గమనించలేక పోతున్నాడు. ఈ దొంగ కూడా దొరికిపోయాడు అనేది ప్రజలకు అర్ధం అవుతోంది. చంద్రబాబును అరెస్టుతో జైళ్లో ఉన్నాడు...ఈయన్ని అరెస్ట్‌ చేయకుండానే ఓపెన్‌ జైళ్లో ఉన్నాడు. ఢిల్లీ ఆయనకు ఓపెన్‌ జైలు. మొన్నొక రోజు వచ్చి కన్పించి పోయాడు. నేడు విచారణకు హాజరయ్యాడు..విచారణలో కూడా తప్పుకు పో డానికే ప్రయత్నం చేస్తాడని నేను భావిస్తున్నా. 

మా మరిదిని వదిలేయండని పురందేశ్వరి రాయభారం
పురందేశ్వరి ఎన్టీఆర్‌ కుమార్తె. చంద్రబాబు వదిన. బంధుత్వ ప్రేమతో చాలా తాపత్రయపడుతున్నారు. బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దెన్‌ వాటర్‌ అంటారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడంలో మాత్రం అందరూ సమిష్టిగా చేశారు. పురందేశ్వరి కాంగ్రెస్‌లోకి వెళ్లి మంత్రిగా చేశారు. అక్కడా మరిదిని కాపాడే ప్రయత్నమే. బీజేపీలోకి వెళ్లి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్‌ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వంపైన విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారు. అసలు లిక్కర్‌ స్కామే లేదిక్కడ. చంద్రబాబు హయాం కంటే తక్కువ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంట్లో ఏదో స్కాం జరిగిందని ఒక కాగితం తీసుకుని వెళ్లారు. అసలు విషయం అదికాదు. అసలు వెళ్లింది చంద్రబాబును కాపాడటానికి. ఆయనకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉండండి..టీడీపీ మొత్తాన్ని బీజేపీలో కలిపేస్తామని రాయబారానికి వెళ్లారు. మొత్తం పార్టీని పాదాక్రాంతం చేస్తాం..మా మరిదిని వదిలిపెట్టండి అని రాయబారానికి వెళ్లిన పెద్ద మనిషి. రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్‌షాకు ఒక మెమోరాండం ఇచ్చినట్లు నటిస్తూ చంద్రబాబు కోసం రాయబారం చేస్తున్నారు. పురందేశ్వరి మహిళ..కేంద్రంలో మంత్రి చేశారు..ఎన్టీఆర్‌ కుమార్తె. కానీ రోజాపై బండారు సత్యనారాయణమూర్తి ఇష్టారీతిన కామెంట్‌ చేస్తే పన్నెత్తి మాట మాట్లాడలేదు. మీ నాన్న కూడా సినిమా ఫీల్డ్‌ నుంచే వచ్చారు కదా..కనీసం ఖండించడానికి కూడా మనసు రాలేదు. కానీ బీజేపీ వద్దకు వెళ్లి చంద్రబాబును కాపాడటానికి ఏదేదో మాట్లాడటం దురదృష్టకర పరిణామం. 

ఆయన పీకే కాదు..కేకే అంటే కిరాయి కోటిగాడు
సిగ్గుమాలిన రాజకీయాలు చేయడంలో ప్రబుద్ధుడు..ఆయనే దత్తపుత్రుడు. ఆయన ఎవరిని కాపాడటానికి పార్టీ పెట్టాడో తెలియదు. 2013లో కేవలం టీడీపీని కాపాడటం కోసం రంగంలోకి దిగిన  ప్రబుద్ధుడు. ఆయన్ను అందరూ పీకే అంటారు..కానీ ఆయన పీకే కాదు...కేకే..కిరాయి కోటిగాడు. కిరాయి తీసుకుని ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాపులను అందలం ఎక్కిదామని కాదు..తన వెంట ఉన్న వాళ్లని పైకి తీసుకొద్దామని ఆయన పార్టీ పెట్టలేదు. కేవలం చంద్రబాబు పార్టీని కాపాడుదామనే రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ఏదో ఒక విధంగా ఆయన టీడీపీని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రతి ప్రయత్నం వల్ల టీడీపీ మరింతగా వీక్‌ అవుతుంది. మొన్నీమధ్యనే టీడీపీ వీక్‌ అయింది..ఇక నేనే దిక్కు అంటాడు. ఆయన మాట్లాడే ధోరణి వల్ల టీడీపీ మరింతగా పతనమయ్యే పరిస్థితి వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి సిగ్గు మాలిన రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది. ఆయన పార్టీ పెట్టిందే కాపులను గుత్తగా తీసుకెళ్లి చంద్రబాబుకు అమ్మాలనే ప్రయత్నం తోనే పెట్టాడు. దీన్ని కాపులు గమనించారు. ఆయన వెంట ఉన్న జనసైనికులు కూడా గమనించారు. అది జనసేన కాదు..బాబు సేన అనే విషయాన్ని కూడా ఆయన వెంటుండే జనం గమనించారు. ప్రజలకు మేం సంక్షేమం అందించాం..మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్‌. నిన్నటి ప్రతినిధుల సమావేశంలో కూలంకుషంగా ఏమేం చేశామో చెప్పి ప్రజల వద్దకు వెళ్తున్నాం. మిగిలిన వాళ్లు చేస్తున్నది రాజకీయం కాదు..అరాచకం. 

Back to Top