రాష్ట్ర అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా

రోజూ 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి లక్ష్యం

ఆక్సిజన్‌ సరఫరాపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమీక్ష

విజయవాడ: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆక్సిజన్‌ విషయంలో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యత అని, ఏపీ అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. ఆక్సిజన్‌ సరఫరాపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్‌ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాపై క్షేత్రస్థాయి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎంటీ మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ చేస్తున్నామన్నారు. రోజూ 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి లక్ష్యమన్నారు.  

రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమల వివరాలను ఆ శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రహ్మణ్యం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి, ఆక్సిజన్‌ అవసరాలు, మొదటి వేవ్‌లో వినియోగించిన ఆక్సిజన్‌ సామర్థ్యంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ వినియోగం, ఉత్పత్తి, అవసరాలపై మంత్రి గౌతమ్‌రెడ్డి చర్చించారు. సమీక్షా సమావేశంలో హోం శాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, వైద్య శాఖ, ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన నోడల్‌ అధికారి, 13 జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు, ఆర్‌ఐఎన్‌ఎల్, ఎల్లెన్‌ బెర్రీ తదితర పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 

Back to Top