జగనన్న కాలనీల్లో అవినీతి జరిగినట్టు నిరూపించ‌గ‌ల‌వా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి స‌వాల్‌

చంద్ర‌బాబును సంతోషపెట్టడానికే పవన్ పర్యటనలు

కుల, మత, ప్రాంతం, పార్టీల‌కు అతీతంగా ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చాం

యావత్తు రాష్ట్ర ప్రజానీకం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు జేజేలు కొడుతోంది

విజ‌య‌న‌గ‌రం: చంద్ర‌బాబును సంతోష‌పెట్టేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వీకెండ్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నాడ‌ని డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. పేద ప్ర‌జ‌ల సొంతింటి క‌ల స‌హ‌కారం అవుతుంటే.. అది చూసి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓర్వ‌లేక‌పోతున్నార‌న్నారు. రాజ‌కీయ ఉనికి కాపాడుకునేందుకు ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ.. ప్ర‌భుత్వంపై నింద‌లు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇళ్ల  నిర్మాణంలో అవినీతి నిరూపిస్తామంటూ హడావుడి చేసిన పవన్ ఏం నిరూపించాడు.?.. వచ్చాడు, చూశాడు.. వెళ్లాడు..? అని ఎద్దేవా చేశారు. గుంకలంలోని జగనన్న కాలనీలో పర్యటన చేసిన పవన్.. ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించగలడా..? అని ప‌వ‌న్‌కు డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి స‌వాల్ విసిరారు. విజ‌య‌న‌గ‌రంలో కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

కోలగట్ల వీరభద్రస్వామి ఇంకా ఎమన్నారంటే..
2019లో కూడా పర్యటనల పేరుతో ఊరూరా తిరిగి జైజైలు పలికించుకుని, చివరకు పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయావు. 2024 లో కూడా పవన్ కు ఓటమి తప్పదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలని కలలుగనే నువ్వు.. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు, ఆ శక్తి, సామార్థ్యాలు నీకు ఉన్నాయా..? చంద్రబాబును సంతోషపెట్టడానికి పర్యటనలు చేస్తే, నిన్ను చూసి సంతోషపడేందుకు నీ అభిమానులు వస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు నీ వల్ల ఉపయోగం ఏమీలేదు. మంత్రులు అవినీతి గురించి మాట్లాడే నువ్వు.. గుంకలాంలోని లబ్ధిదారులతో అవినీతి జరిగిందని మాట్లాడించగలిగావా..? నీ పార్టీకి చెందినవాళ్లను ప్రలోభపెట్టినా, వారికి ఆశలు చూపించినా ఒక్క గృహ నిర్మాణ లబ్ధిదారుడు కూడా బయటకు రాలేదు. జిల్లాలో ఉన్న నీ అభిమానులను తీసుకువచ్చి కేకలు వేయడానికి, హడావుడి చేయడానికి గుంకలమే అక్కరలేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నీ ఫ్యాన్స్ జాతర చేసుకోవచ్చు. 

రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు మా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.  గత ప్రభుత్వం ఒక్క ఇళ్లపట్టా కూడా ఇవ్వలేదు కాబట్టే ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ మా ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదే ఆయన చేసిన తప్పా..?. కుల, మత, ఏ పార్టీ వాళ్లు అని చూడకుండా, రాజకీయాలను పట్టించుకోకుండా అర్హతే ప్రామాణికంగా మా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. యావత్తు రాష్ట్ర ప్రజానీకం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు,  చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు ఆయన వెన్నంటి ఉన్నారు. ఎన్నికల ముందు వరకూ గోల నీది. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగనన్న కాలనీలపై.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడైనా చర్చకు వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధమా?

రుషికొండ వెళ్లి ఏం నిరూపించంగాలిగావ్?
రుషికొండ వెళ్లి ఏం సాధించావు? ఏం నిరూపించగలిగావు? నువ్వు వెళితే అది అవినీతా? నువ్వు చెబితే అది నీతా?. 2014 ఎన్నికలలో చంద్రబాబుతో అంటకాగి, ఓట్లు వేయించిన నువ్వు.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 600కు పైగా హామీల్లో ఒక్క హామీని అయినా అమలు చేయించగలిగావా పవన్.?. హామీలు ఎందుకు అమలు చేయాలేదని చంద్రబాబును అడిగే సత్తా లేని పవన్.. ఇవాళ రోడ్లు మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసే అర్హత లేదు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగమే పరిపాలనా రాజధానిగా విశాఖ నిర్ణయం. మెడికల్ కాలేజీలు, భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు ఇవి అభివృద్ధి కాదా?. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని మా ముఖ్యమంత్రి విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే మీరు అడ్డుకోవడం వాస్తవమా, కాదా..?

2014-19లో టీడీపీ సర్కార్ చేసినదేంటి అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రానున్న కాలంలో, రాని అధికారం కోసం, లేని భ్రమలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదు. 14 కిలోమీటర్ల నుంచే నీకు స్వాగతం పలికారని చెబుతున్నావు కదా..?. నీ వెంట వచ్చిన వాళ్లలో, నీ సైకో ఫ్యాన్స్ తప్పితే ప్రజలు ఎవరైనా ఉన్నారా..? పవన్ కొంతమంది తన అభిమానులను తెచ్చుకుని మీటింగ్ పెట్టాడే తప్ప, సామాన్య ప్రజానీకం ఎవరూ రాలేదని తేటతెల్లం అయింది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని విధంగా పవన్ చేసిన అట్టహాసంతో ఏం సాధించగలిగాడు..?. సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రశ్నించే అర్హత చంద్రబాబుకు, నీకు లేదు. మీరే కాకుండా మరో పదిమంది వచ్చినా వైయ‌స్ జగన్‌ని రాజకీయంగా ఎవరూ ఏమీ చేయలేరు. పవన్ కల్యాణ్ వచ్చాడు.. వెళ్లాడు, మళ్లీ వస్తాడు.. వెళతాడు. అలాగే రేపు లోకేష్ వస్తాడు.. వెళతాడు తప్ప.. వీళ్ల వల్ల ఏమవుతుంది?. ప్రజాభిమానం ఉన్న వైయ‌స్ జగన్‌ని.. వీళ్ళు ఎవరూ ప్రజలకు దూరం చేయలేరు. సత్తువ లేని ఉపన్యాసాలు ఇచ్చి, అవాస్తవాలు చెబితే విజయనగరం జిల్లా ప్రజలను నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేస్తున్నాం` అని వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు.

Back to Top