దేవినేని చంద్రశేఖర్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌ కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్‌పాండ్‌లో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ను వైయ‌స్ఆర్ సీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మరాల్సి వచ్చిందని చెప్పారు. 

అధికార పార్టీ దోపిడీ ఎక్కువగా ఉందని, పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ అధికంగా ఉందని ఆరోపించారు. కేసుల నుండి టీడీపీ నేతలు బయటపడ లేరని అన్నారు. రామణుడి లంక నుండి విభీష్ముడు బయటకు వచ్చినట్లు దేవినేని ఉమ నుండి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని చంద్రశేఖర్, తాను ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమను అణగదొక్కాలని మంత్రి దేవినేని ఉమ చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మంత్రి ఆగడాలు సాగవన్నారు.

 
 

 

తాజా వీడియోలు

Back to Top