గుంటూరు: చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైయస్ఆర్ యంత్ర సేవ’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు మరికాసేపట్లో గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు.
ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా వైయస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్ స్థాయిలోనూ ఏర్పాటుచేస్తోంది. ఎంపికైన రైతు గ్రూపులు కోరుకున్న యంత్ర పరికరాల కొనుగోలు కోసం 40 శాతం రాయితీనందించడమే కాదు.. యంత్ర విలువలో 50 శాతం బ్యాంకు రుణాన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.690.87 కోట్ల అంచనాతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో 3,800 ట్రాక్టర్లు, 391 హార్వెస్టర్లు, 22580 వివిధ రకాల యంత్ర పనిమున్లను సమకూర్చారు. సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు రైతు గ్రూపుల ఖాతాలకు నేరుగా జమచేసింది.
ప్రతి ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు లక్ష్యంతో తాజాగా 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయిలో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. గతేడాది 3,800 ఆర్బీకేల పరిధిలో ట్రాక్టర్లతో కూడిన యంత్ర పరకరాలను అందించగా.. తాజాగా 2,562 ఆర్బీకేల్లో ఏర్పాటుచేస్తున్నారు. రూ.361.29 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, సబ్సిడీ రూపంలో రూ.125.48 కోట్లు ప్రభుత్వం నేరుగా రైతు గ్రూపుల ఖాతాలకు జమచేయనుంది.
తాజాగా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో 2562 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్లు, 13,573 యంత్ర పనిముట్లు సమకూరుస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో రైతు గ్రూపులకు అందిస్తున్న ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను గుంటూరులో శుక్రవారం సీఎం వైయస్ జగన్ ప్రారంభించడమే కాదు సబ్సిడీ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమచేస్తారు. అదే సమయంలో నియోజకవర్గ కేంద్రాల్లో యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభిస్తారు.
ఇక కిసాన్ డ్రోన్ సేవలను సైతం ఆర్బీకే స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో మండలానికి మూడు చొప్పున ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జూలైలో 500 డ్రోన్ సీహెచ్సీలు ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు.. రైతుల కోరిక మేరకు 50 శాతం సబ్సిడీపై ఏడు లక్షల స్ప్రేయర్లు, టార్పాలిన్లను అక్టోబర్లో పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు.