పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సీఎం సమీక్ష

తాడేపల్లి: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. పులివెందుల మోడల్‌ టౌన్‌ను నాలుగు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని, 2053 వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికను రూపొందించామని అధికారులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు వివరించారు. 

పులివెందుల నగరంలో మంచినీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ తదితర సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. పాడా పరిధిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ నమూనాలను అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వసతులను కూడా కల్పించి ఆధునీకరిస్తున్నామని చెప్పారు. వీధి వ్యాపారులకు రెండు, మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మించే భవనాలు ఏళ్లు గడుస్తున్నా కొద్దీ మరింత అందంగా కనిపించేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ఉలిమెల చెరువును సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ కింద అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మంచినీటి శుద్ధి ప్లాంట్‌ను కూడా అనుబంధంగా ఏర్పాటు చేయాలన్నారు. చెరువు నుంచి పాడా పరిధిలో ప్రజలకు మంచినీటిని అందించే విధంగా ప్రణాళిలకు రూపొందించాలని ఆదేశించారు. పులివెందుల మెయిన్‌ రోడ్‌లో మార్పు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 
 

Back to Top