రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ. 30.91 కోట్లు ఆదా

విజయవాడ : ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో టిడ్కోలో(టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ) సత్ఫలితాలు సాధించామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంత్రి బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియలో తాజాగా మరో రూ. 30.91 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.275.7 కోట్లకు ఈ పనులను చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బిడ్ దాఖలు చేసి ఎల్ 1 గా నిలిచిందని తెలిపారు. ఈ ప్యాకేజిలో రూ.30.91 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి.. ప్రజా ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. ఇంతవరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. ఇలా 12 ప్యాకేజిల్లో మొత్తం రూ. 392.23 కోట్ల మేర ప్రజా ధనం ఆదా అయ్యిందని ఆయన వివరించారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 156  నుంచి రూ.316 వరకు ఖర్చు తగ్గి, ప్రభుత్వంపై భారం తగ్గిందని ఆయన తెలిపారు.

ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,532.59 కోట్లు ఆదా 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక విధానం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,532.59 కోట్లు ఆదా అయ్యాయి. అత్యధికంగా పోలవరం హెడ్‌వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.782.80 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్తూరుపాడు రిజర్వాయర్‌ పనుల్లో 67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలాయి.
 

Back to Top