ఢిల్లీ: ఏపీ విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలున్నాయి. వీటిలో 7 అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా.. మరో ఏడు అంశాలు ఏపీకి సంబంధించినవి ఉన్నాయి. సమావేశం సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.20వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని తెలిపింది. షీలాబేడీ కమిటీ సిఫార్సుల ప్రకారం 89 సంస్థలను విభజించాలని సూచించింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇవే.. - ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్లో విభజన - షెడ్యూల్-10లోని సంస్థల విభజన - చట్టంలో లేని ఇతర సంస్థల విభజన - ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన - సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన - బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన - ఏపీఎస్సీఎల్, టీఎస్సీఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014-15 రైస్ సబ్సిడీ విడుదల. ఏపీకి సంబంధించిన అంశాలు ఇవే.. - నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం - ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు - ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు - పన్ను మదింపులో పొరపాట్ల సవరణ - నూతన విద్యాసంస్థల ఏర్పాటు - నూతన రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు.