పోల‌వ‌రం అంచ‌నాల‌పై అక్క‌సు

పోల‌వ‌రం ప‌నులు పరుగులు పెట్ట‌డంతో  చూసి తట్టుకోలేకపోతున్న ఎల్లో గ్యాంగ్

2016లో టీడీపీ ప్ర‌భుత్వం రూ. 1500 కోట్లు అంచనా వ్యయం పెంచడంపై ఎల్లో మీడియా ఏం చేసింది 

ప్రాజెక్ట్ లో ఏదైనా అంచనాలను పెంచాలన్నా, సవరించాలన్నా కేంద్ర జలసంఘం ఆమోదం తప్పనిస‌రి

పాత అగ్రిమెంట్ కు అదనంగా కొత్త పనులు  జత అవ్వడంతో ప్రాజెక్టు అంచనాలు కూడా పెరిగాయి

కేంద్రజలసంఘం సూచనల మేరకు 211.12కోట్లతో కొత్తగా టెండర్లు
 
ఎంతటి దుష్ప్రచారం చేసినా  అనుకున్న సమయానికే పోల‌వ‌రం పూర్తి 

ఆంధ్రుల చిరకాల వాంచను నెరవేర్చేందుకు దృఢనిశ్చయంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అడుగులు

అమ‌రావ‌తి:  నిన్నటి వరకూ పోలవరం ప్రాజెక్టులో తట్టమట్టి తీయలేదు. బొచ్చెడు కాంక్రీట్ వేయలేదు. ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి అంటూ ముసలి కన్నీరు కార్చిన పచ్చపార్టీ నేతలు ప్రాజెక్టు పనులు వర్క్ ప్రోగ్రెస్ చూసి కుళ్ళుకునే పరిస్దితికి వచ్చారు. దీంతో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ప్రాజెక్టు మీద దుమ్మెత్తిపోద్దామా అంటూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అంచ‌నాలు పెంచుతున్నార‌ని ప‌చ్చ పార్టీ బుర‌ద జ‌ల్లుతోంది. నిజానికి ఇవి అన్ని పచ్చ మీడియా సృష్టిస్తోన్న అబద్దాలే.

చంద్రబాబు ఐదేళ్లలో కట్టని పోలవరం ప్రాజెక్ట్ ను ఏపీ సీఎం వైయ‌స్ జ‌గన్ పూర్తి చేస్తుండే సరికి దాన్ని అడ్డుకోవడానికి చేయాల్సినదంతా చేసేస్తున్నారు. తనకు వంతపాడే పచ్చ మీడియాను అడ్డు పెట్టుకొని చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు.  తన హయాంలో గ్రాఫిక్స్, అవినీతికి పోలవరం ప్రాజెక్ట్ ను కేరాఫ్ అడ్రస్ గా మార్చిన పచ్చ పార్టీ అధినేత..  ఇప్పటికీ పోలవరానికి ఆ అవినీత ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గత వారం రోజులుగా పచ్చ నాయకులు, వీరికి వంతపాడే పచ్చమీడియా పోలవరం ప్రాజెక్ట్ పైన నానా యాగీ చేస్తున్నాయి. వైయ‌స్ జగన్ ప్రభుత్వం పోలవరం పనులను శరవేగంగా చేయడం చూసి తట్టుకోలేకపోతున్నారు. పోలవరం అంచనాలను భారీగా పెంచి అవినీతి పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ కు లబ్ది చేకూర్చడానికి అదనంగా పెంచారని ఊదరగొడుతున్నారు. 
పోలవరం ప్రాజెక్ట్ లో ఏదైనా అంచనాలను పెంచాలన్నా, సవరించాలన్నా కేంద్ర జలసంఘం ఆమోదం తప్పక తీసుకోవాలి.  ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం కేంద్ర జలసంఘం ఆదీనంలోని ప్రత్యేక అథారిటి పర్యవేక్షణలో జరుగుతోంది. నిర్మాణంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, సవరించాలన్నా ఈ అథారిటీ ఫైనల్. రాష్ర్ట ప్రభుత్వం కేవలం నిర్మాణ పనిని మాత్రమే పర్యవేక్షిస్తోంది. అతిపెద్ద వరద డిశ్చార్జ్ కలిగిన ప్రాజెక్ట్ కావడంతో డిజైన్లు కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలే పర్యవేక్షిస్తున్నాయి. గత రెండేళ్లుగా సంభంవించిన భారీ వరదలకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ పలుచోట్ల దెబ్బతింది. ముఖ్యంగా డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాంలతో పాటు మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. వీటిని అప్పటి ప్రభుత్వం ఇంజనీరింగ్ నియమాలకు విరుద్ధంగా చేయడం వల్ల కూడా ఆ పనులు దెబ్బతిన్నాయి. ఈ అనుభవాలను ద్రిష్టిలో పెట్టుకొని 50 లక్షల క్యుసెక్కుల వదర వచ్చినా జలాశయం తట్టుకొని స్పిల్ వే మీదుగా వరద సులభంగా పారేందుకు నిర్మాణ పనుల్లో, డిజైన్లలో తరచూ కేంద్ర జలసంఘం మార్పులు చేస్తోంది. ఈ మార్పుల ఆధారంగా నిర్మాణ పనుల్లో వ్యత్యాసం ముఖ్యంగా పని పరిమాణం పెరుగుతోంది. ఒక్క అప్రోచ్ ఛానెల్ లోనే దాదాపు కోటి ఇరవై లక్షల ఘనపు మీటర్ల మట్టిని తవ్వాల్సి వస్తోంది. తొలుత వేసిన అంచనా కన్నా ఇది నాలుగు రెట్లు అధికం. ఈ విధంగా డిజైన్లలో, పనుల్లో మార్పులు చేర్పులు కేంద్రం చేస్తోంది. ఇంకా మూడు డిజైన్లకు సంబంధించి అనుమతి లభించాల్సి ఉంది. 

పోలవరం జలాశయంలో ప్రస్తుతం అంచనాల వ్యయం 1656 కోట్లు పెంచడంపై గగ్గోలు పెడుతున్న తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ పచ్చ మీడియా 2016లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు రూ. 1500 కోట్లు అంచనా వ్యయం పెంచడంపై అప్పుడు, ఇప్పుడు నోరు విప్పడం లేదు. ప్రస్తుతం పెరిగిన పనుల వల్ల అంచనా వ్యయం పెరిగింది. కానీ 2016 లో ప్రాజెక్ట్ (హెడ్ వర్స్క్) అంచనా వ్యయాన్ని 4054 కోట్ల నుంచి 5535 కోట్లకు పెంచారు. అంటే 1481 కోట్ల రూపాయలు పెంచుతూ 2016 సెప్టెంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

2013లో అప్పటి సంస్థ 4054 కోట్లకు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2015-16 సవరించిన అంచనాల ప్రకారం అంచనా వ్యయం పెంచాలని అప్పటి నిర్మాణ సంస్థ కోరడంతో ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం వ్యయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.  కానీ దీనిపై అప్పట్లో  తెలుగుదేశం అనుబంధ మీడియా కానీ నోరు విప్పలేదు. ఇప్పుడు పెంచిన ధరలపైనే గగ్గోలు పెట్టడం వారి ద్వంద నీతికి అద్దం పడుతోంది.

నిజానికి గత పనులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ లో అదనపు పనులను ఇటీవలే కేంద్ర జలసంఘం సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చింది. అందుకు అనుగుణంగా రూ.683 కోట్ల పనులకు వైయ‌స్ జగన్ సర్కార్ ఇటీవల జ్యూడిషియల్ అప్రూవల్ తీసుకుని టెండర్లను పిలిచింది.  ఐతే ఇటీవల డిడిఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పనులు వేగంగా జరుగుతున్నాయని  సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రతకోసం మరి కొన్ని కొత్త డిజైన్లు సూచించారు.. దీని ప్రకారం పాత అగ్రిమెంట్ కు అదనంగా కొత్త పనులు  జత అవ్వడంతో ప్రాజెక్టు అంచనాలు కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా సిడబ్ల్యూసీ సూచనలకు అనుగుణంగానే.. వీటిని అదనంగా చేర్చారు. 

స్పిల్ ఛానెల్ ఎండ్ కటాఫ్ డయా ఫ్రంవాల్ ;
స్పిల్ ఛానెల్ చివరన 12 మీటర్ల లోతు నుండి 1354 మీటర్ల పొడవున కటాఫ్ వాల్ ను నిర్మించనున్నారు.  స్పిల్ ఛానెల్లో నిర్మించే కాంక్రీట్ బ్లాకులు, మట్టి స్పిల్ వే నుండి వచ్చే భారీ వరద ప్రవాహాని కొట్టుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది.  ఒక వేళ స్పిల్ వే నుండి విడుదల చేసే భారీ వరద ప్రవాహా వేగానికి కాంక్రీట్ బ్లాకులు, మట్టి  కొట్టుకుపోయినా ఈ డయా ఫ్రం వాల్ అడ్డుకుంటుంది. దీనిని 83.17కోట్లతో నిర్మించనున్నారు.

గ్యాప్-2లో నేలను గట్టిపరిచే పనులు ;
ప్రాజెక్టులో అతికీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మించాలంటే ముందుగా నదీగర్భంలోని ఇసుకను దాదాపు 100 అడుగుల లోతునుండి గట్టిపరచుకుంటూ నేలను రాయిలాగా మార్చాలి. దీనినే వైబ్రోకాంపాక్షన్ అంటారు. ఇలా నేలను గట్టి పరుస్తూ ఆ గ్యాప్ లో ఇసుక ను నింపుతారు. ఇప్పుడు దీంట్లో మారిన డిజైన్ల ప్రకారం ఇటుకతో పాటు కంకరను నింపాలి. దీనినే స్టోన్ కాలమ్స్ గా పిలుస్తారు. 

అలాగే భూమిని లోతు నుండి గట్టిపరచుకుంటూ చేసే పనులనే డీప్ సాయిల్ మిక్సింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల భూమిలోపల ఖాళీ ప్రదేశం లేకుండా రాయిలాగా గట్టిగా మారుతుంది.  దీనిపైనే ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం నిర్మిస్తారు. ఇలా చేయడం వల్ల ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం కట్టిన తరువాత బొట్టు నీరు కూడా నదీగర్భంలోనుండి దిగువకు లీకు అవ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పటిష్టతకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పనులకు కేంద్రజలసంఘం సూచనల మేరకు 211.12కోట్లతో కొత్తగా టెండర్ పిలవడం జరిగింది.

గ్యాప్-1,మరియు గ్యాప్-3 లలో ఢ్యాంల నిర్మాణం ;
గతంలో ఎపి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో పోలవరం హెడ్ వర్క్స్ పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరంగ్ తో చేసుకున్న ఒప్పందంలో గ్యాప్-1లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించేలా అగ్రిమెంట్ లో ఉంది. ఐతే కేంద్రజలసంఘం నిపుణుల సూచనలకు అనుగుణంగా 586 మీటర్ల పొడవున ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం భూమిలోపల నుండి ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం నిర్మించడంతో పాటు, స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది.  ఈ పనులకు సైతం 242.87 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. ఇలా ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం, మరియు స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు చేయడం వల్ల నీరు ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా అడ్డుకుంటుంది. ఇలా చేయడంతో పక్కనే ఏర్పాటు చేస్తున్న జల విద్యుత్ ప్రాజెక్ట్ కు కూడా రక్షణగా ఉంటుంది. 

ఇంక గ్యాప్-3లో కూడా ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించాలని ఉంది. అయితే ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యాం బదులు 140 మీటర్ల పొడవున, స్పిల్ వే లెవల్ కు కాంక్రీట్ డ్యాం నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం 11.64 కోట్లతో టెండర్లు పిలిచారు.

స్పిల్ వే కుడి,ఎడమ కొండలకు రక్షణ చర్యలు ;
స్పిల్ వే బ్రిడ్జికి కుడి, ఎడమ పక్కన ఉన్న కొండలకు రక్షణ చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా వర్షాలకు కొండ చర్యలు విరిగి పడిపోకుండా గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు,  కేంద్రజలసంఘం సూచనల మేరకు 134.21 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు.. ఈ పనులన్నీ కూడా హెడ్ వర్క్స్ లో భాగంగా కేంద్ర జలసంఘం ఇటీవల అదనంగా సూచించడంతో అదనంగా 683 కోట్ల రూపాయల ఖర్చుఅవుతుందని అంచనాతో ఇటీవలే జ్యూడీషియల్ ప్రివ్యూ పూర్తి అయిన తరువాత టెండర్లు ఆహ్వానించారు. వీటితో పాటు మరికొన్ని అదనపు పనులు కూడా కేంద్ర జలసంఘం సూచించింది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ వాల్యూకు కొత్తపనులు చేరడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది.  ఈ పెరిగిన అంచనాలను కేంద్రజలసంఘం ఆమోదం పొందిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. 

ఐతే ప్రాజెక్టు అనుకున్నసమయానికే పూర్తి అవుతోంది. దీంతో క్రెడిట్ అంతా వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వంకు వెళ్ళిపోతుందనే అక్కసుతో పచ్చపార్టీ నేతలు మొదటి నుంచి దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతటి దుష్ప్రచారం చేసినా ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేసి ఆంధ్రుల చిరకాల వాంచను నెరవేర్చేందుకు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది. అయితే ప్రాజెక్టును పారదర్శకంగా.. కేంద్రం సూచనతోనే పూర్తి చేస్తున్న వైయ‌స్ జగన్ సర్కార్ పై టీడీపీ నేతలు, పచ్చమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా చరమగీతం పాడాలని.. అవాస్తవాలతో ప్రజలను గందరగోళపరిచే వారికి ప్రజలే బుద్ది చెబుతారని వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు అంటున్నారు.

Back to Top