జగనన్న అభయం.. చెరవీడిన జాలర్లు

పాకిస్తాన్‌ చెర నుంచి జాలర్లు విడుదల

సీఎం జగన్‌ చొరవతో 20 మంది మత్స్యకారులు స్వదేశానికి  

2018 డిసెంబర్‌ 2న వైయస్‌ జగన్‌ను కలిసి బాధిత కుటుంబాలు

సీఎం ఆదేశాల మేరకు విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి

విజయవాడ: పాకిస్తాన్‌ జైల్‌లో బందీగా ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో నేడు విడుదల అయ్యారు. 2018 డిసెంబర్‌లో సముద్రంలోకి వేటకు వెళ్లిన 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో పాకిస్తాన్‌ కోస్టల్‌గార్డులు వారిని అరెస్టు చేసి పాకిస్తాన్‌ జైల్లో పెట్టారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు, ఇద్దరు తూర్పు గోదావరి జిల్లా వాసులు. 13 నెలల పాటు పాక్‌ జైల్లో మగ్గిన వీరికి సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో విముక్తి లభించింది. 20 మంది మత్స్యకారులు వాఘా సరిహద్దు నుంచి భారత్‌లోకి అడుగుపెట్టనున్నారు. కాగా, మరో ఇద్దరు జాలర్లు మాత్రం వచ్చే నెలలో విడుదల కాబోతున్నారు.

అన్నా.. మావాళ్లను విడిపించండి..
ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను బాధిత మత్స్యకార కుటుంబీకులు 2018 డిసెంబర్‌ 2వ తేదీన శ్రీకాకుళం జిల్లా తొక్కువలసలో కలిశారు. అన్నా.. వేటకు వెళ్లిన మావాళ్లను పాకిస్తాన్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. టీడీపీ ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోవడం లేదు. దయచేసి మీరే మా వారిని విడుదల చేపించాలని మొరపెట్టుకున్నారు. చలించిన వైయస్‌ జగన్‌ మత్స్యకారుల విడుదల కోసం అనేక సార్లు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి జాలర్లను విడిపించే బాధ్యత అప్పగించారు.

దిగొచ్చిన పాక్‌ ప్రభుత్వం
అప్పటి నుంచి విదేశాంగ శాఖతో ఎంపీ విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. అనేకసార్లు కేంద్రమంత్రులు, విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాంగ శాఖపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఎంపీ విజయసాయిరెడ్డి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల బృందంతో మత్స్యకారుల కుటుంబాలను ఢిల్లీకి తీసుకెళ్లి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ వద్దకు తీసుకెళ్లి అనేక మార్లు చర్చలు జరిపించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి మత్స్యకారుల విడుదల విషయమై ప్రధాని, అమిత్‌షా నోటీస్‌కు తీసుకువెళ్లారు. 2019 డిసెంబర్‌ 31న సీఎం వైయస్‌ జగన్‌ మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోండి అని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ కూడా రాశారు. విదేశాంగ శాఖ సంప్రదింపులతో దిగొచ్చిన పాక్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 31న మత్స్యకారులను రిలీజ్‌ చేయడానికి అంగీకరిస్తూ విదేశాంగ శాఖకు సమాచారం పంపించింది.

ఆ కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాకిస్తాన్‌ జైల్లో ఉన్న మత్స్యకారులను విడుదల చేసేందుకు ప్రత్యక్షంగా కృషిచేస్తూనే.. ఆ మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 4500 సాయం ప్రతి నెలా అందిస్తున్నారు. అంతేకాకుండా బాధిత మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లోన్‌లు ఇప్పించి వారికి అండగా నిలిచారు.

అమృత్‌సర్‌ చేరుకున్న మంత్రి మోపిదేవి
జైల్లో నుంచి విడుదలైన మత్స్యకారులను తీసుకువచ్చేందుకు రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అమృత్‌సర్‌కు చేరుకున్నారు. వాఘా సరిహద్దు నుంచి భారత్‌కు చేరుకోనున్న మత్స్యకారులను మంత్రి మోపిదేవి కలుసుకుంటారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం రేపు ఉదయం ఢిల్లీ తరలించనున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో మత్స్యకారులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

 

Back to Top