ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుంది అన్నట్టుగా...వైజాగ్లో జగన్పై జరిగిన దాడి విషయంలో తండ్రి క్షుద్రంగా స్పందిస్తే...తనయుడు జుగుప్సాకరంగా ట్వీట్లు చేశారు. వాటిలోని మెసేజ్ చదివిన వారికెవరికైనా...చినబాబుగారి చితికిపోయిన చిన్న మెదడు విషయంలో జాలేయక తప్పదు. సమయం, సందర్భం తేడా తెలియకుండా, ఇంగిత జ్ఞానం నశించిన నారా అండ్ సన్ తమ సంకుచిత మనస్తత్వాలను, సిగ్గూశరమూ లేకుండా ప్రదర్శించారు. మనసున్న మనుషులు ’ఛీ’కొట్టేలా చేసుకున్నారు.
సానుభూతి కోసం జగన్ ఆడిన నాటకమని, పొడిచినవాడు జగన్ వీరాభిమానేనని తండ్రి చంద్రబాబు తలా తోక లేని మాటలు మాట్లాడితే, ఇన్నేళ్లు తండ్రి చేస్తూ వస్తున్న కుట్రలు, కుతంత్రాల రాజకీయాలను జగన్కు అంటగట్టే ప్రయత్నం చేశాడు చినబాబు లోకేష్.
అయినా కాకులు కోకిలపాటలు పాడతాయని, నక్కలు ఊళలేయకుండా, సింహగర్జనలు చేస్తాయని అనుకునే వారిదే తప్పంతా? నారా ఫాదర్ అండ్ సన్ది తప్పేమి కాదు. వారి సహజ లక్షణాల మేరకే స్పందించారు. కాకుల గోలే వినిపించారు. పుండుమీద వాలి పొడుచుకు తినే నీచత్వాన్నే ప్రదర్శించారు.
వారసత్వంగా వచ్చే పదవుల మాటేమో కానీ విలువలు మాత్రం వారసత్వంగానే వస్తాయి. వ్యక్తిత్వం ఇంటిగడపలోనే తీర్చిదిద్దబడుతుంది. ఊహ తెలిసిన రోజు నుంచి జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిని గమనిస్తూనే వుంటారు. నిత్యం జనం మనిషిగా, జనం గురించి ఆలోచించే మనిషిగా వైయస్ కనిపిస్తూనే వుంటాడు. ప్రజలకోసం ఎందాకైనా అనే తండ్రి మనసత్వం తెలుస్తూనే వుంటుంది. తన మన తేడా లేకుండా, గడపతొక్కి వచ్చిన వారి సమస్య తెలుసుకుని, నేనున్నాననే భరోసా తండ్రి నుంచే జగన్కు అబ్బింది. ఆటుపోట్లు ఎన్నున్నా, చుట్టు రాజకీయ కుట్రలు ఎన్ని జరుగుతున్నా, తనదైన వ్యక్తిత్వంతో, ధీరత్వంతో, హుందాతనంతో, విలువలతో ముందుకే నడిచిన తండ్రి ధైర్యమూ రక్తంలో ఇంకేవుంటుంది. మండుటెండల్లో ప్రజల కోసం నడిచిన మహనేత పాదయాత్రా వారసత్వం అయ్యేవుంటుంది. అందుకే మరి ఏడాది పాటు జనం మధ్యనే నడుస్తూ, జనం సమస్యలు వింటూ, వారికి ధైర్యాన్నిస్తూ, భరోసాగా నిలుస్తూ...రేపటి వెలుగులు తెస్తానంటూ నమ్మకమై నడుస్తున్నాడు జగన్. తండ్రిలానే జనం మనిషయ్యాడు. అచ్చం నాన్నలానే బాధిత జన హృదయాలకు ఆత్మబంధువై..ప్రేమ, ఆప్యాయతలను పంచుతున్నాడు. వైఎస్సార్, వైయస్ జగన్లు విలువల వారసత్వానికి ప్రతీకలు.
స్వంత మామను, తన తండ్రి ఎలా వెన్నుపోటు పొడిచాడో చినబాబుకు తెలిసే వుంటుంది. వైస్రాయ్ ఘాతుకం వినేవుంటాడు. తన మన తేడా లేకుండా పబ్బం గడుపుకోవడం కోసం వాడుకోవడం, ఆ తర్వాత కరేపాకులా పక్కన పడేయడం తండ్రి నుంచి తెలిసేవుంటుంది. రాజకీయమంటేనే కులం, రాజకీయమంటేనే డబ్బు సంపాదించడం, ప్రజలకు మభ్యపెట్టే మాటలు చెప్పడం, అలవికానీ హామీలతో మోసం చేయడం అన్నీ నారాచంద్రబాబుగారి వారసుడిగా లోకేష్ నేర్చేసేవున్నారు. లేనిగొప్పలు చెప్పుకోవడం, అంతా మేమే అని చాటు కోవడం, ఘనత ఎవరు సాధించినా అది తమ ఖాతాలో వేసుకోవడం, వైఫల్యాలను, తమ రాజకీయాలకు ఎవరైనా బలయితే ఎదుటివారిపై నెట్టేయడమనే క్షుద్రరాజకీయాలను తండ్రి దగ్గర తెగ నేర్చేవుంటాడు చినబాబు. అబద్దాలు చెప్పడం అలవాటయ్యే వుంటుంది. రెండునాల్కల ధోరణివంటపట్టే వుంటుంది. డ్యాష్బోర్డు కహానీలు కమ్మగా చెప్పడం అలవాటయ్యే వుంటుంది.
నిన్న బీజెపీతో, నేడు కాంగ్రెస్ కలిసి జత కట్టిన తండ్రి వారసత్వం చాలానే నేర్పించి వుంటుంది. నాలుగున్నరేళ్ల వరకు బీజెపీని, ప్రధాని మోదీని తండ్రి ఎంతలా పొగిడాడో, కాంగ్రెస్ను ఎంతగా దుమ్మెత్తిపోశాడో పొలిటికల్ ఎరినాలోకి ఎంటరయిన చినబాబు అర్థం చేసుకునేవుంటాడు. అణువణువునా పిరికితనం జీర్ణించుకుపోయినా, కుట్రలతో, కుతంత్రాలతో, గుడ్లురిమి చూడటాలతో తండ్రి ఎలా డ్రామాలేస్తుంటాడో లోకేష్బాబు వంటపట్టించుకునే వుంటాడు. అందుకేనేమో అచ్చం తండ్రిలానే దిగజారిపోతున్నాడు. ఇక తన తండ్రి నుంచి తనయుడు ఏమైనా నేర్చుకోవాల్సింది వుందంటే....అది ...అధికారం తమున తండ్రి పడుపాట్ల నుంచే. ఆ రోజులు షురూ అయ్యాయి...ఇక చినబాబుగారు తండ్రిలానే మరింత అపరిణతి సాధించడం గ్యారంటీ. బాబు క్షుద్ర రాజకీయ వారసత్వమంటే అదేమరి!!