ప్రజలతో మమైకం.. ధీమా కల్పనే ధ్యేయం

అదే హోరు..అదే జోరు.. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. ప్రజల కష్టాలకు పాలకులే కారణమని దుయ్యబట్టారు. శ్రీమతి వైయస్ షర్మిల జనంతో మమేకమై కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ వారికి అభయమిస్తున్నారు. అధైర్యపడకండి.. ఏడాది ఓపికపడితే జగనన్న ముఖ్యమంత్రవుతారని, అన్ని సమస్యలు తొలగిపోతాయని వారికి ధైర్యం చెబుతున్నారు.

మహబూబ్‌నగర్:

తాగునీటి కోసం 4, 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శ్రీమతి వైయస్ షర్మిల పేర్కొన్నారు. నడిగడ్డ ప్రాంతంలో 180 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రూ.100 కోట్లు మంజూరు చేసినా ఇప్పటికీ ఆ పథకం అమలు అతీగతీలేకుండా పోయిందన్నారు. మహిళలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలు మంత్రి డీకే అరుణకు అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. మహిళగా ఉండి మహిళల ఇబ్బందులు తీర్చలేకపోయిన మంత్రి అరుణకు కూడా ఆ సీట్లో కూర్చొనే అర్హత లేదని షర్మిల స్పష్టంచేశారు. నెట్టెంపాడు పనులు పూర్తిచేయకుండా ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించినా..ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేక పోయారని దుయ్యబట్టారు. ఆ పాపమంతా సర్కారుదేనని ఆమె నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానంలో పాదయాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల బుధవారం గద్వాల శివారు ప్రాంతం నుంచి నెట్టెంపాడు ప్రాజెక్టు వరకు పాదయాత్ర కొనసాగించారు.

రచ్చబండలో సమస్యల రచ్చ

     సంగాల చెరువు, గోనుపాడు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఏగ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య..మరోవైపు తీవ్ర విద్యుత్తు కొరత..పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పుల పాలు కావడం తప్ప ఏమీ మిగలడం లేదు..పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలాలను అమ్మాల్సిన పరిస్థితి...లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధైర్యపడకండి.. ఏడాది ఓపికపడితే అన్ని సమస్యలు తొలగిపోతాయని శ్రీమతి షర్మిల వారికి అభయమిచ్చారు.

నెట్టెంపాడు నుంచి నీరివ్వలేకపోయారు

    అనంతరం ధరూరు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తూ..25వేల ఎకరాలకే పరిమితం చేసి అపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నెట్టెంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రెండులక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి, రూ.1200 కోట్లు మంజూరుచేసి 75 శాతం పనులు పూర్తిచేసినా మిగిలిన 25 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందన్నారు. అభివృద్ధి పనులపై ఈ పాలకుల చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు.

ఫీజు రీయింబర్సుమెంట్‌ను నీరుగార్చారు

     తరతరాల వెనకబాటుతనానికి చదువే ముఖ్యమని భావించిన దివంగత మహానేత వైయస్ ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని అమలుచేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చి విద్యార్థులకు ఫీజులు భిక్షం వేసినట్లు ఇస్తున్నారని విమర్శించారు. జగనన్న జైల్లో ఉన్నా ఆయన నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అదేవిధంగా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అంటూ నిత్యం డాక్టర్ వైయస్‌ను గుర్తుచేసుకుంటున్నారన్నారు.  విశ్వసనీయతంటే అదని శ్రీమతి షర్మిల చెప్పారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందాల్సిన వైద్యం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు మాత్రం వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు లేదా ఇతర దేశాలకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటూ ప్రజల వైద్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అబద్ధపుమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top