కొత్త సంప్రదాయానికి వైయస్ఆ‌ర్‌సిపి శ్రీకారం

సరికొత్త సంప్రదాయానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెరతీసింది. శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలకు జవాబుదారీగా నిలిచింది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. వాస్తవానికి శాసనసభ వర్షాకాల సమావేశాలలో ప్రజాసమస్యలు చర్చించడానికి అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సహకరించలేదు. అయినా బాధ్యతగా‌ ప్రజాసమస్యలు చర్చించలేకపోయినందుకు క్షమించమని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభ్యులు అందరూ ప్రజలను కోరారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో 13 రోజులు ఎలాంటి కార్యకలాపాలూ జరుగకుండా వృథా అయ్యాయి. రాష్ట్ర శాసనసభ అయిదు రోజుల సమావేశాలు కూడా అదే తంతుతో ముగిశాయి. సమావేశాలకు పెట్టిన ఖర్చు నిరుపయోగం అయిందని, సమస్యలు చర్చించలేకపోయామని అక్కడ గానీ, ఇక్కడ గానీ ఏ ఒక్క పార్టీ కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా క్షమాపణలు చెప్పలేదు.

అనేక రకాల సమస్యలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితులలో వారి సమస్యలు సభలో చర్చించలేకపోయినందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందారు. ఈ నేప‌థ్యంలో వారు ప్రజలకు క్షమాపణలు చెప్పి నూతన ఒరవడికి శ్రీకార చుట్టారు. 

శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం రోజునే అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కు అయ్యాయని తేలిపోయింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ సమావేశానికి అసలు హాజరే కాలేదు. శాసనసభ సమావేశాలు, అందులో చర్చించవలసిన అంశాల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. సమావేశాల తొలి రోజున వారు ఆడుతున్న డ్రామా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలసిపోయింది. ప్రణాళిక ప్రకారమే ఆ రెండు పార్టీలు కలిసి సభలో సమస్యలపై చర్చ జరుగకుండా అడ్డుకున్నాయి. అధికార పక్షానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా కొమ్ముకాసిందని అందరికీ అర్థమైపోయింది. మిగిలిన విపక్షాలన్నీ ఈ రెండు పార్టీలపై దుమ్మెత్తిపోశాయి.

ఐదు రోజుల వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాయిదాలతోనే ముగిసిపోయాయి. మొత్తం ఐదు రోజులలో 4 గంటల 10 నిమిషాలు మాత్రమే సభ జరిగింది. ప్రభుత్వం మూడు బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టింది. సమావేశాల మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గంటా ఆరు నిమిషాలు, టీడీపీ 39 నిమిషాలు, టీఆ‌ర్ఎ‌స్ 52 నిమిషాలు, వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ 18 నిమిషాలు, ఎంఐఎం ఆరు నిమిషాలు, సీపీఐ 14 నిమిషాలు, బీజేపీ 20 నిమిషాలు, సీపీఎం 12 నిమిషాలు, లో‌క్‌సత్తా 6 నిమిషాలు, స్వతంత్ర సభ్యులు 17 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకున్నారు.

అత్యంత దారుణమైన విషయం ఏమంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు నిమిషాలు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు 5 నిమిషాలు మాత్రమే సభలో మాట్లాడారు. ఈటెల రాజేంద్ర 11 నిమిషాలు, వైయస్ విజయమ్మ 3 నిమిషాలు, గుండా‌ మల్లేష్ 4 నిమిషాలు, బీజేపీ నేత లక్ష్మీనారాయణ 6 నిమిషాలు మాట్లాడారు. 

వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం గంటా 13 నిమిషాల సమయం వృథా అయింది. టీఆర్ఎ‌స్ 30 నిమిషాలు, టిడీపీ 14 నిమిషాలు, వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ 7 నిమిషాలు, బీజేపీ 8 నిమిషాలు, సీపీఐ 4 నిమిషాలు, సీపీఎం, ఎంఐఎం ఒక్కో నిమిషం వృథా చేశాయి. 

సమావేశాల నిర్వహణ తీరుపై వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాక‌ర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి కుట్ర పన్ని శాసనసభను సక్రమంగా జరగనివ్వలేదని విమర్శించారు. దానికి తోడు శాసన సభాపతి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్,‌ మేకతోటి సుచరిత విమర్శించారు. సమావేశాలలో ప్రజా సమస్యలను చర్చించలేకపోయినప్పటికీ వైయస్‌ఆర్ సిపి ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతే కాకుండా శాసనసభలో చర్చకు రాని ప్రజాసమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తామని చె‌ప్పడం గమనార్హం.

తాజా వీడియోలు

Back to Top