రాజధాని ఎవరికోసం బాబు

ప్రజల కోసమా లేక విదేశీయుల కోసమా
వ్యాపారస్తులకు కొమ్ముకాయడం కోసం..
రైతులను బలిపశువులను చేయొద్దు
తక్షణమే రైతాంగానికి ధాన్యం డబ్బులు చెల్లించాలి

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్ధసారథి టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన తాబేదారులకు కోడిపందాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని పార్ధసారథి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందని ఫైరయ్యారు.  రైతుల నుంచి ధాన్యం సేకరించిన రెండ్రోజుల్లో చెక్కులు ఇస్తామన్న చంద్రబాబు..నెలరోజులవుతున్నా ఇప్పటివరకూ పైసా కూడా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతాంగానికి ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

ఆరు జిల్లాల్లో  రైతులకు వాస్తవంగా రూ. 2 వేల కోట్ల పైబడే  చెల్లించాల్సి ఉందని, ఎప్పుడు ఇస్తారో తెలియని ఆందోళనతో రైతులు ఉన్నారని పార్ధసారథి  ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా ఆరు జిల్లాల్లో ఈప్రభుత్వం ధాన్యం కూడ కొనలేదని తూర్పారబట్టారు. చంద్రబాబు నిర్వాకం కారణంగా ఏపీలో రైతాంగం తమ భవిష్యత్తుపై భయాందోళన చెందుతున్నారని పార్దసారథి వాపోయారు.  రబీలో  20 నుంచి 30 శాతం మాత్రమే సాగయితే లక్షల ఎకరాలకు నీరిచ్చామంటూ ప్రభుత్వనేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పుడు లెక్కలు చూపిస్తూ మోసపూరిత పాలన సాగిస్తున్నారని ఫైరయ్యారు. రబీకి వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంతసేపు చంద్రబాబు సింగపూర్, దావోస్ ,  ఇండస్ట్రియల్ మీట్ లో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని డబ్బా కొట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదని పార్ధసారథి ఫైరయ్యారు. రుణాలు మాఫీ చేయకుండానే అన్నీ చేశామంటూ చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. ఏ బ్యాంకరు రైతుల ఇంటికి వెళ్లకుండా రుణాలన్నీ మాఫీ చేస్తాం, బ్యాంకుల్లోని బంగారం ఇంటికి తెప్పిస్తామని చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు అన్నీ చేశామని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. రుణమాఫీ గురించి ప్రశ్నించిన విలేకరులను చంద్రబాబు కసురుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఇంకా రూ. 91, 415 కోట్లు రైతాంగానికి అప్పులు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారన్నారు.

రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పార్దసారథి మండిపడ్డారు. సింగపూర్ కంపెనీల కోసం ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని బలి చేయొద్దని చంద్రబాబుకు హితవు పలికారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్థసారధి మీడియా సమావేశంలో మాట్లాడారు. అగ్రిజోన్ పేరుతో కృష్ణాజిల్లా రైతాంగానికి ఉరితాడులాంటి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన మండిపడ్డారు. 15 లక్షల ఎకరాల్లో 35ఏళ్ల పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

తుళ్లూరులో భూములకు మంచిరేట్లు రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తోందని పార్థసారధి విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాల్లో శాస్త్రీయత ఎంతమాత్రం లేదన్నారు. మెట్ట ప్రాంతాల్లో అగ్రిజోన్ ఎలా సాధ్యమని, సింగపూర్ కంపెనీలకు లబ్ది చేయాలన్న ఉద్దేశంతోనే ఈ డ్రామా ఆడుతున్నారని విరుచుకుపడ్డారు.  రైతు తన హక్కును చట్టబద్ధంగా వినియోగించుకునే అవకాశం కూడా లేదా? ఏపీ రాజధాని నిర్మాణం ప్రజలకా లేక విదేశీయుల కోసమా అని ప్రశ్నలు సంధించారు. 
Back to Top