సెక్స్ రాకెట్ హీరోతో చంద్రబాబు చెట్టాపట్టాల్

టీడీపీ నేతలను తప్పించేందుకే రాష్ట్రంలో దాడులు
కాల్ మనీ బురదని అందరికీ అంటగట్టేందుకు చంద్రబాబు కుట్ర

అసెంబ్లీః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అరాచకాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నించడం దుర్మార్గమమన్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఇలాంటి వ్యవహారం దేశ చరిత్రలో ఎక్కడా  వినలేదనీ, తాత్కాలిక రాజధాని అయిన విజయవాడలోనే ఇదంతా జరగడం బాధాకరమన్నారు.  విజయవాడకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. సెక్స్ రాకెట్ హీరోతో చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన కార్యకర్తలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని రోజా  మండిపడ్డారు. నిందితులపై  చర్యలు తీసుకోవడం మానేసి  వైఎస్ జగన్ పై ఎదురుదాడి చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. 

వెనిగళ్ల శ్రీకాంత్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కి సన్నిహితుడు. ఇద్దరూ కలిసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు, ఈ కాల్‌మనీలో ప్రసాద్ ఉన్నారని స్థానికులు చెప్పినా ఆయన్ను ఎందుకు విచారించలేదు?అని రోజా సూటిగా ప్రశ్నించారు. బుద్దా వెంకన్న, ఇతరుల పేర్లు కూడా బయటకు వచ్చాయన్నారు. . తమ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టే చంద్రబాబు వాళ్లను తప్పించేందుకు ఈ బురదను అందరికీ అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తప్పులుంటే ఇనప పాదాలతో తొక్కేయాలన్నారు. విజయవాడలో జరిగింది వేరు. 18 ఏళ్ల లోపు పిల్లలను కూడా వ్యభిచారంలోకి దించుతున్నారని రోజా టీడీపీపై  ధ్వజమెత్తారు. వీళ్లను కఠినంగా శిక్షిస్తేనే మహిళలకు భరోసా ఇచ్చినట్లవుతుందన్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాళ్లను అణిచేసేలా చూడాలన్నారు.

కాల్‌మనీ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ పెద్దలందరినీ బయటకు లాగాలని రోజా డిమాండ్‌ చేశారు. ఈ కాల్‌మనీ ఘటనతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు మహిళల బాధలు పట్టడం లేదని దుయ్యబట్టారు. ఆఫీసుకెళ్లాలంటే ఉద్యోగినులు, కాలేజీలకు వెళ్లాలంటే విద్యార్థినులు భయపడుతున్నారని వాపోయారు. వనజాక్షి, రిషితేశ్వరి కేసులను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసును అలానే చేయాలనుకుంటున్నారని రోజా విమర్శించారు.



Back to Top