<strong>బీజేపీతో అంటకాగుతూ.. బయట వ్యతిరేక ప్రచారం</strong><strong>భేటీ వెనుక ఉన్న ఆంతర్యమేంటో చెప్పాలి</strong><br/>విశాఖపట్నం: చంద్రబాబుకు తెలియకుండా సుజనాచౌదరి కేంద్రమంత్రితో భేటీ అయ్యారని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అదీప్రాజు మండిపడ్డారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిరసనగా విశాఖలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండి ప్రజలకు అనేక హామీలిచ్చి మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉధృతం చేస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చెప్పడంతో ప్రజల దగ్గర చెడ్డ పేరు వస్తుందనే భయంతో కేంద్రంలో మంత్రుల రాజీనామా అంటూ డ్రామాలు ఆడారని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం అనగానే ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నామని చెప్పి.. ఇంకా రహస్యంగా మంతనాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. అరుణ్జైట్లీతో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రహస్యభేటీ వెనుక ఉన్న ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భేటీ చంద్రబాబుకు తెలియకుండా జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కిందిస్థాయి అధికారిని బదిలీ చేయాలన్నా.. చంద్రబాబు సంతకం కావాలని, అలాంటిది రహస్యభేటీ చంద్రబాబుకు తెలియదనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలన్నారు. ప్రత్యేక హోదా సాధనపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే నిన్న జరిగిన రహదారుల దిగ్బంధాన్ని పోలీసుల చేత అడ్డుకున్నారన్నారు.