విజయవాడ: మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం మరో వైపు మహిళా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి విజయవాడలో ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొని తమ అమూల్యమైన సందేశం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఆర్కే రో్జాను ఈ సదస్సుకు ప్రభుత్వమే ఆహ్వానం పంపింది. దీంతో సదస్సుకు హాజరయ్యేందుకు రోజా శనివారం హైదరాబాద్ నుంచి గన్నవరం ఏయిర్పోర్టుకు చేరుకుంది. అయితే ఆమె ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందోనన్న భయంతో ప్రభుత్వం ఏయిర్పోర్టులోనే రోజాను నిర్బంధించారు. వాస్తవానికి మహిళా సదస్సు కు రమ్మంటూ.. ఆహ్వానించిందీ, పాస్ కూడా ఇచ్చిందీ ప్రభుత్వ అధికారులే. తీరా సదస్సుకు హాజరైన తర్వాత ఆమెను అడ్డుకున్నారు. దలైలామా అక్కడకు వస్తున్నారని సాకుగా చూపించి, ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే పోలీసులు ఆమెను అడ్డుకుని, ఒక రూమ్ లో బంధించారు. ఆమె చుట్టూ పోలీసులు మొహరించారు. సదస్సులో కూడా ఆమెను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను సిద్ధం చేశారు. ఒకవైపు మహిళల హక్కుల కోసం పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహిస్తూ.. మరోవైపు మహిళా ఎమ్మెల్యేని నిర్భందించటం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది.