సూరజ్ గ్రాండ్ హోటల్ నుంచి డబ్బుల మూటలు తరలింపు

నంద్యాల: నంద్యాలలో పచ్చపార్టీ డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేస్తోంది.  పోలింగ్‌ దగ్గరపడుతుండటంతో టీడీపీ నేతలు ప్రలోభాల పర్వంలో దూకుడు మరంతగా పెంచారు. కోట్లాది రూపాయల మూటల సంచులను గుట్టుచప్పుడు కాకుండా నంద్యాలకు తరలించారు.  నంద్యాల పట్టణంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌ కేంద్రంగా టీడీపీ నాయకులు పంపకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజులుగా ఈ హోటల్‌లో అధికార పార్టీ నేతలు మకాం వేశారు.

ఈ హోటల్‌ను వేదికగా చేసుకుని 20 రోజులుగా మంత్రులు పన్నాగాలు సాగిస్తున్నారు. స్థానిక నేతలను హోటల్‌కు పిలిపించుకుని డబ్బులు ముట్టజెబుతున్నట్టు సమాచారం. బూత్‌కు రూ. 5 లక్షల చొప్పున పంచేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఇంతవరకు ఈ హోటల్‌వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

మరోవైపు అధికార పార్టీ నేతలు పోలీసులను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతున్నారు. దీంతో తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారని వైయస్సార్‌ సీపీ ఆరోపిస్తోంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. అధికార పార్టీ నేతలపై నిఘా పెంచాలని కోరుతోంది.
Back to Top