<strong>జహీరాబాద్ (మెదక్ జిల్లా):</strong> కాంగ్రెస్- టిడిపిలు కుమ్మక్కై మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. వైయస్ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాంది అని ఆయన అభివర్ణించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో శనివారం సాయంత్రం ఆయన వైయస్ఆర్ సిపి నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. తరువాత పార్టీ నాయకుడు ఎస్.ఉజ్వల్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూర్యప్రకాశ్ మాట్లాడారు.<br/>దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిది జగమంత కుటుంబం అని నల్లా అభివర్ణించారు. మహానేత ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం అన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయం చేసి శ్రీ జగన్ను జైలుకు పంపాయని విమర్శించారు. కాంగ్రెస్, టిడిపిలు తలకిందులైనా జనం అంతా జగన్ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ఆ పార్టీలకు సరైన గుణపాఠం నేర్పడం తథ్యమని హెచ్చరించారు. మైనార్టీలు, క్రిస్టియన్లు పూర్తిగా వైయస్ఆర్ సిపి వెంటే ఉన్నారన్నారు. మిగతా కులాలు కూడా శ్రీ జగన్కు అండగా ఉన్నాయన్నారు.<br/><strong>పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి :</strong>వైయస్ఆర్సిపి కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింతగా పటిష్టం చేయాలని పార్టీ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా కన్వీనర్ బట్టి జగపతి కోరారు. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించాలన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ విషయంలో కాంగ్రెస్, టిడిపిలు చేస్తున్న కుట్రలపై ప్రజలతో సంతకాలు సేకరించి రాష్ట్రపతికి పంపుతామన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు ఉద్యమాలు చేపట్టాలన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీ జగన్ సోదరి శ్రీమతి షర్మిల ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారన్నారు.