<strong>అగ్రి జోన్ పేరుతో ఆంక్షలు </strong><strong>రైతుల గొంతు కోసేందుకు చర్యలు</strong><strong>కక్ష కట్టి భూముల మీద ఆంక్షలు</strong><br/>హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల మీద కక్ష కట్టారని మరోసారి రుజువు అయింది. అగ్రి జోన్ పేరుతో రైతుల గుండెల మీద కుంపటి పెట్టేశారు.<br/>రాజధాని ప్రాంతాన్ని రెండు జిల్లాలకు విస్తరిస్తున్నామని చెప్పి చంద్రబాబు ప్రణాళికలు రచించారు. కానీ అందులో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేసే మాదిరిగా ప్లాన్ లు తయారు చేశారు. ముఖ్యంగా అగ్రి జోన్ అని పెడుతున్న ప్రాంతంలో దాదాపు 70శాతం వరకు క్రిష్ణా జిల్లాకు వస్తుంది. ఇందులో దాదాపు 13 లక్షల ఎకరాల భూమిని అగ్రి జోన్ గా మార్చేశారు. ఈ ప్రాంతంలో 35 సంవత్సరాల పాటు వ్యవసాయమే చేసుకోవాలని ఆంక్షలు విధించారు. ఒక వైపు రాజధాని ప్రాంతంగా చెబుతున్న తుళ్లూరు, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే తెలుగుదేశం నాయకులు భూములు కొని పెట్టుకొన్నారో ఆయా ప్రాంతాల్ని కమర్షియల్ ప్రాంతాలుగా విభజించారు. మిగిలిన ప్రాంతాల్ని వ్యవసాయం జోన్ గా తొక్కేశారు. అంటే కేవలం టీడీపీ నాయకులు కొనుక్కొన్న భూముల ధరలు ఆకాశాన్ని అంటేలా పెరిగిపోవాలి. కానీ, మిగిలిన రైతులు మాత్రం దాదాపు 4 దశాబ్దాలుగా అలాగే మిగిలిపోవాలన్న మాట.<br/>వాస్తవానికి నిజంగా చంద్రబాబు కి రైతుల మీద ప్రేమ ఉంటే రాజధాని కోసం మూడు పంటలు పండే భూముల్ని ముట్టుకొనే వారు కాదు. అక్కడ బీడు భూములు, నీటి తడి అందని మెట్ట భూములు ఉండనే ఉన్నాయి. కానీ వాటిని తెలుగుదేశం నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేజిక్కించుకొన్నారు. రాజధాని చుట్టూ టీడీపీ నాయకుల రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేట్లుగా స్కెచ్ వేశారు. ఇప్పుడు ఈ రియల్ వెంచర్లకు బయట కూడా రైతుల భూములు అలాగే ఉండిపోవాలని ఆంక్షలు విధిస్తున్నారు.<br/>తూళ్లూరు చుట్టుపక్కల టీడీపీ నాయకులు, సింగపూర్ కంపెనీల ఇళ్ల సముదాయాలకు మంచి ధర రావాలని స్కెచ్ వేశారు. ఇందుకు గాను చుట్టుపక్కల ఇళ్ల సముదాయాలు లేకుండా జాగ్రత్త పడుతున్నరు. అంటే ప్రగతి అంతా ఒకేచోట ఉండేట్లుగా చర్యలు తీసుకొంటున్నారు. అంతిమంగా కొన్ని తరాల పాటు ప్రజలు నష్టపోయే పనులకు ఒడిగడుతున్నారు. పైగా జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య తారతమ్యాలు వచ్చేట్లుగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. భవిష్యత్ లో ప్రాంతీయ ఉద్యమాలకు తావు ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. <p/>