పరిపాలన అస్తవ్యస్తం

పుంగనూరు: రాష్ట్రంలో టమోటా రైతులు నష్టపోకుండ వారి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ ఎంపీ మిధున్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా  తాగునీటి కోసం  ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.  లేనిపక్షంలో  మిర్చీ రైతుల కోసం పోరాటం చేసిన తరహాలో టమోటా రైతుల కోసం పోరాటం చేస్తామంటూ  హెచ్చరించారు. పుంగనూరు మండలం కమతంపల్లెలో ఎంపి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో అమరావతి జపం మినహా , మరేమి కన్పించడం లేదన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక , ప్రభుత్వం రుణమాఫి చేయకపోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి, రైతుల సమస్యలు అర్థంకావడం లేదన్నారు. మిర్చీ రైతుల కోసం వైయస్సాఆర్సీపి అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల దీక్ష  తరహాలో టమోటా రైతుల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.  ముఖ్యంగా రాష్ట్రంలో భూగర్భజలాల మట్టం తగ్గిపోయి, నీటి సమస్య తీవ్రమైందన్నారు. వేసవికి మునుపే ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని, నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరేత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. నీటి సమస్య నివారణ కోసం తక్షణమే తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండు చేశారు. లేకపోతే లోకేష్‌ చెప్పిన ట్లు తాగునీరు లేని గ్రామాలను తయారు చేస్తారని ఎద్దెవా చేశారు. 

ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎంపి పరిధిలోని నియోజకవర్గాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రోడ్ల అభివృద్ధికి అధిక శాతం నిధులు విడుదల చేయించడం జరిగిందని ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజలకు అండగా ఉంటూ దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను అమలుపరిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వైయస్సాఆర్సీపికి అండగా నిలవాలని ఆయన కోరారు.

Back to Top