నంద్యాల ఎన్నికల పరిశీలకుడిగా నాగిరెడ్డి

హైదరాబాద్, 9 జూలై 2013 :

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడిగా భూమా నాగిరెడ్డి వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని పార్టీ వివరించింది. ఇదే నియోజకవర్గంలో ఎన్నికల పరిశీలకురాలిగా భూమా శోభా నాగిరెడ్డి వ్యవహరిస్తారని పత్రికలో పొరపాటున ప్రచురితమైందని పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. అయితే ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకురాలిగా శోభా నాగిరెడ్డి వ్యవహరిస్తారని స్పష్టం చేసింది.

పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 3వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో 9 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను దాఖాలు చేసుకోవచ్చని ‌రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న నామినేషన్ల పరిశీలన, 15న అభ్యంతాల స్వీకరణ, 16న అభ్యంతరాలపై తుది విచారణ, 17వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.

కర్నూలు జిల్లాలోని 883 గ్రామ పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న కర్నూలు డివిజన్‌లోని 299 పంచాయతీలు, 3212 వార్డులకు.. రెండవ విడతలో 27న నంద్యాల డివిజన్‌లోని 287 పంచాయతీలు, 2916 వార్డులకు.. మూడవ విడతలో 31వ తేదీన ఆదోని డివిజన్‌లోని 297 గ్రామ పంచాయతీలు, 3274 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.

Back to Top