విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి మతిభ్రమించిందని, ఆయన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కేశినేని నాని విజయవాడ ఎంపీగా ఉండటం దౌర్భాగ్యమని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం ఆయన ఆనందయ్య మందును పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ఆలయాలు కూల్చి బాత్రూమ్లు కట్టారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారని.. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదన్నారు. టీడీపీ నేతలు విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. కృష్ణలంక ప్రజలకు ఇబ్బంది కలగకుండా రిటర్నింగ్ వాల్ నిర్మిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.