విద్యాశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష 

తాడేప‌ల్లి:  విద్యాశాఖపై ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్ కుమార్‌, పాఠశాల విద్యాశాఖ(మౌలిక వసతులు కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది, అధికారులకు ఐబీ ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు సహా సిబ్బంది  శిక్షణ పొందనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యా బోధన ఒకటో తరగతితో ప్రారంభం కానుంది. ఐబీ.. జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనుంది.

ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష జరిపారు. ప్రతి మూడు పాఠశాలలకు ప్యూచర్‌ స్కిల్స్‌పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.. ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్‌లను వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గుర్తించామని వెల్లడించారు. వారికి గౌరవవేతనం చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఫ్యూచర్‌ స్కిల్స్‌ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్నీ త్వరగా పూర్తిచేయాలన్న సీఎం.. దీనిలో భాగంగా ఫైనాన్షియల్‌ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని.. దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని సీఎం అన్నారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్‌ స్కిల్స్‌ బోధించేందుకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ఇప్పటికే ఒక సెమిస్టర్‌కు సంబంధించి సిలబస్‌ రూపొందించామని అధికారులు వెల్లడించారు.

Back to Top