తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు పెద్ద పీట వేశారని, అవినీతి బయటపెడితే బీసీలపై దాడి అంటూ టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని తెలిపారు. శనివారం ఆయన తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అమరావతి రైతులను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే రైతులకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి బయటకు వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే చంద్రబాబు, ఎల్లోమీడియా ఆరాటమని విమర్శించారు. వైయస్ జగన్ తన కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారన్నారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అవినీతి బయటకొచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అక్రమ సొమ్ము మొత్తం చంద్రబాబు వద్దకే చేరిందని ఆరోపించారు. చంద్రబాబు పాత్రపై కూడా సిట్ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని పార్థసారధి మండిపడ్డారు.