అసెంబ్లీ: ఉద్దానం ప్రాంత ప్రజలకు, భావితరాలకు వైయస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఉద్దానం ప్రజలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే తపన, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారని, రూ.742 కోట్ల వ్యయంతో 100 కిలోమీటర్ల తాగునీటి పైపులైన్ నిర్మిస్తున్నామన్నారు. జూన్లో పైపులైన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ ప్రాంతానికి సురక్షితమైన తాగునీరు అందుతుందని మంత్రి రజిని చెప్పారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు ఇబ్బందిలేకుండా రానున్న కాలంలో పలాస డయాలసిస్ యూనిట్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.50 కోట్లతో నిర్మించనున్నామన్నారు. ఆ ఆస్పత్రిలో 151 మంది మెడికల్ స్టాఫ్ను అందుబాటులో ఉంచి ఉద్దానం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 680 మండలాలు ఉన్నాయని, 7 మండలాలకు సంబంధించిన అతిపెద్ద సమస్య టీడీపీ కళ్లకు కనిపించలేదా..? అని ప్రశ్నించారు. ఉద్దానం ప్రజలకు మంచి చేస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ సభ్యులు ఆరోపణలు చేయడం హేయం అన్నారు. ఇదేనా ఉద్దానం ప్రజలపై ప్రతిపక్షానికి ఉన్న చిత్తశుద్ధి అని నిలదీశారు.