ప్రజలు ఛీకొట్టినా.. టీడీపీ నేతల్లో మార్పు రాలేదు

హోం మంత్రి మేకతోటి సుచరిత

దళితులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాం

అయ్యన్నపాత్రుడు సంస్కారహీనుడు

అయ్యన్నపై స్పందించడం అంటే ..అశుద్ధంపై రాయి వేయడమే

జాతిని బట్టి కాదు..ప్రవర్తను బట్టి గౌరవం ఉంటుంది

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వంగవీటి హత్య జరిగింది

సీఎం వైయస్‌ జగన్‌ చెబితే..ఒక్క క్షణంలో రాజీనామా చేస్తా

తాడేపల్లి: ప్రజలు ఛీకొట్టినా..చంద్రబాబు, టీడీపీ నేతల్లో మార్పు రాలేదని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దళితులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని హెచ్చరించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సుచరిత మీడియాతో మాట్లాడారు. 

ఎలా స్పందించాలి?:

ఆయన ఎంతో సీనియర్‌. ఎన్నో పదవులు పొందారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆయన మాటలు నిజంగా సిగ్గుచేటు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక అధికారిణి బట్టలు విప్పించి కొడతానన్నాడు. అలాంటి వ్యక్తి నుంచి ఇంత కంటే మంచి మాటలు వస్తాయని అనుకోవడం లేదు. ఏం మాట్లాడాలి దీని గురించి.. ఒక హోం మంత్రి గురించి, ఒక మహిళ గురించి ఏం మాట్లాడారో విన్నారు కదా.

రాష్ట్రంలో ఉన్న ఎస్పీల గురించి ఏం మాట్లాడారో విన్నారు కదా. నేను ఒక దళితురాలిని కాబట్టి నా గురించి గత హోం మంత్రితో పోల్చి ఏం మాట్లాడారో చూశారు కదా. ఇంకా మరికొన్ని వాక్యాలు మనిషి పలకకూడనివి ఆయన మాట్లాడడం విన్నారు కదా.

 

అందుకు గర్వపడుతున్నాం:

వాస్తవానికి నేను దీనిపై స్పందించవద్దు అనుకున్నాను. కానీ రావాల్సి వచ్చింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్వయంగా చంద్రబాబు అన్నారు. కానీ మహానుభావుడు అంబేడ్కర్‌ జన్మించిన జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాం.

మీరు మాట్లాడిన భాషను, మేము ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలోనూ మాట్లాడలేను. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది.

గొప్పతనం అనేది మన ప్రవర్తను బట్టి వస్తుంది కానీ, కులం, జాతి వల్ల రాదు. ఒక మహిళను బట్టి అలా మాట్లాడిన ఆ వ్యక్తి సంస్కారం ఏమిటన్నది అందరికి తెలుస్తుంది.

 

మీకు బుద్ధి చెప్పారు:

నాకు సీఎంగారు తగిన గుర్తింపు ఇచ్చారు. 151 సీట్లు గెలిచి ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన సీఎంగారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

మీరు 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అన్నీ బాగా చేసి ఉంటే, ఓడిపోరు కదా. మీరు ఏం మాట్లాడారు. జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తిని సీఎం చేశారని అన్నారు. కానీ ఆయన ఏ పరిస్థితుల్లో జైలుకు వెళ్లాలో అందరికీ తెలుసు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి, మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఆయనకు అధికారం కట్టబెట్టారు.

 

కనీస విచక్షణ లేదు:

వంగవీటి రంగా హత్య మీ హయాంలో జరిగింది. ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేశారు. ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్షనేత జగన్‌గారిపై హత్యాయత్నం జరిగితే కోడి కత్తి దాడి అంటారా. నాడు మీరు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో మీపై హత్యాయత్నం జరిగితే, అప్పుడు విపక్షనేతగా ఉన్న వైయస్సార్‌ గారు స్వయంగా వచ్చి పరామర్శించారు. మీకు అండగా నిల్చారు.

 

మీకు ఎందుకంత మంట:

ఇవాళ జగన్‌గారు కోరితే ఈ క్షణం రాజీనామా చేస్తాను. మీరు మా గురించి చాలా దారుణంగా మాట్లాడారు. మల్లెపూలు కట్టుకుని అమ్మే వాళ్లు మనుషులు కారా. ఇంకా మీ మాటలను సమర్థించుకునేందుకు పాస్టర్లు.. ఓ మై సన్‌ అంటారు కాబట్టి, తాను కూడా అన్నానని చెప్పడం అనైతికం. ఒక వ్యక్తి సంస్మరణ సభకు వచ్చి ఇలా మాట్లాడడం అంటే, మీ ముఖం చూడడానికి ఎవరూ ఇష్టపడడం లేదని అర్ధమవుతుంది. దళిత మహిళను హోం మంత్రిని చేస్తే మీకు ఎందుకు కడుపు మంట. మీరు చేయలేని పనిని మా సీఎంగారు చేశారు.

 

ఆధారాలు చూపండి:

మా పని తీరు బాగా లేదని మీరనుకుంటే ప్రశ్నించండి. అన్నింటికీ స్పష్టంగా సమాధానం చెబుతాం. కానీ వ్యక్తిగతంగా మాపై విమర్శలు చేయడం సరి కాదు. దిశ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. దాని గురించి అడగండి చెబుతాం. మీ పాలనలో మహిళలకు ఏమేర న్యాయం చేశారో చెప్పండి. ఇప్పుడు మహిళలకు రక్షణ లేదనుకుంటే ఆధారాలు చూపండి.

చంద్రబాబుగారికి మహిళలపై గౌరవం ఉంటే, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాడు వనజాక్షిని కొట్టి, ఆమెనే తప్పు పట్టారు. ఇప్పుడు మాపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు.

 

అనివార్యంగా మాట్లాడుతున్నాను:

సీఎంగారు, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు సరి కాదు. ప్రజల తీర్పుతో మేము అధికారంలోకి వచ్చాం. మా పాలన బాగా లేకపోతే ప్రజలు మళ్లీ తీర్పు ఇస్తారు. అయినా అన్నీ మర్చి ఇష్టానుసారం వ్యాఖ్యలు, విమర్శలు చేసిన అయ్యన్నపాత్రుడిపై స్పందించడం అంటే అశుద్ధంపై రాయి వేయడమే. నేనైతే ఇలాంటి అశుద్దాలపై ఎప్పుడూ రాయి వేయను. కానీ అనివార్యంగా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. హోం మంత్రి అయిన నాపైనే ఇలా వ్యాఖ్యలు చేశారంటే, సాధారణ మహిళలపై మీకు ఏం గౌరవం ఉంటుంది.

 

నేరాలు తగ్గాయి. అయినా..:

రాష్ట్రంలో 15 «శాతం నేరాలు తగ్గాయని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. కానీ దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాస్కులు ధరించని వాటికి సంబంధించి నమోదైన 80 వేల కేసులను కూడా నేరాలుగా చూపి, రాష్ట్రంలో 64 శాతం కేసులు పెరిగాయని చంద్రబాబుగారు దుష్ప్రచారం చేస్తున్నారు. 

 

ఇష్టానుసారం మాట్లాడొద్దు:

నిన్న ఎమ్మెల్యే జోగి రమేష్‌ గారు దాడికి వెళ్లారన్నారు. కానీ ఆయన ఒంటరిగా వెళ్లారు. విపక్ష నేతపై అలా దాడికి వెళ్తే, పోలీసులు చూస్తూ ఊర్కుంటారా. నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అవన్నీ ప్రజలు చూశారు కాబట్టే, మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకోండి. ఇష్టానుసారం మాట్లాడవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను.

 

వాస్తవం–అవాస్తవం:

నిజానికి నిన్న మా ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతకు ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లాడు. ఆయన వెంట ఎక్కువ మంది కూడా లేరు. కానీ అప్పటికే అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండి దాడి చేశారు. ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. అది వాస్తవం. అలాగే పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారన్నది అవాస్తవం.. అని హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.

Back to Top