తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడని విమర్శించారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిదని, రాష్ట్రాన్ని విభజించి, వైయస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరింది అని ఆమె పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు.. సంక్రాంతి అల్లుళ్ళు లాగా వస్తున్నారు.. ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబు ది.. ఆమె మాటలకు విలువ లేదు అని మంత్రి రోజా వెల్లడించారు. అనంతపురంలో ఫిబ్రవరి 11న జరుగనున్న `సిద్దం` సన్మాహాక సభ తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దం పోస్టర్లను మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఉషాశ్రీ చరణ్, పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది.. ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయింది అని మంత్రి రోజా పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి.. నా గురించి మాట్లాడుతుండడం సిగ్గుచేటు అని ఆమె మండిపడ్డారు. టీడీపీ- జనసేనకు అభ్యర్థులు లేరు.. పెద్దిరెడ్డి గురించి ఆదిమూలం మాటలు బాధ పెట్టాయని మంత్రి రోజా అన్నారు. ఆయన్ను గెలిపించింది పెద్దిరెడ్డి.. కక్ష సాధింపుగా ఆయన మాట్లాడారు అని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీ పార్టీలో మార్పులు- చేర్పులు అర్థం చేసుకోవాలన్నారు. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. వైయస్ జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతో కష్టపడుతున్నారు.. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.