ఉన్న‌త విద్య‌, పేద‌రిక నిర్మూల‌న ప్ర‌భుత్వ ధ్యేయం

భావిత‌రాల కోసమే స‌మున్న‌త నిర్ణ‌యాలు

నాడు-నేడుతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మారుస్తున్నాం

సింగుపురం క‌స్తూర్బా పాఠ‌శాలలో అద‌న‌పు త‌ర‌గ‌తి గదుల నిర్మాణానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాప‌న

శ్రీకాకుళం రూరల్ : ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విద్యా వ్య‌వ‌స్థ‌లో తీసుకువ‌చ్చిన విప్ల‌వాత్మ‌క‌ సంస్క‌ర‌ణ‌లు మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. శ్రీ‌కాకుళం రూర‌ల్ మండలంలోని క‌స్తూర్బా గాంధీ విద్యాలయం (సింగుపురం) ప్రాంగ‌ణంలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఇక్క‌డి విద్యార్థినుల‌తో ఆయ‌న ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న‌కు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. విద్యార్థినులంతా ఇక్క‌డి వ‌స‌తులు, పాఠ‌శాల నిర్వ‌హ‌ణ, అందిస్తున్న భోజ‌న వ‌స‌తుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని అన్నారు. నాడు- నేడు ఫేజ్-2 లో భాగంగా మొత్తం 48 ల‌క్ష‌ల రూపాయ‌ల అంచ‌నా విలువ‌తో ప‌నులు చేప‌డుతున్నామ‌ని అన్నారు. 

నాడు-నేడు లో భాగంగా అనేక పాఠశాల‌ల రూపురేఖ‌ల‌న్నీ మారిపోయాయ‌ని చెప్పారు. ఈ అద‌న‌పు త‌ర‌గతి గ‌దుల నిర్మాణాన్ని మ‌రో 90 రోజుల్లో పూర్తి చేసి, ఈ పాఠ‌శాల నిర్వాహ‌కుల‌కు అందిస్తామ‌న్నారు. ఇక్క‌డి విద్యార్థినులు త‌మ‌కు ఇంకో డార్మేట‌రీ కావాల‌ని, ఇంకొన్ని అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు కావాల‌ని కోరారని, అందుకు త‌గిన విధంగా సంబంధిత అధికారులతోనూ, త‌ల్లిదండ్రుల‌తోనూ మాట్లాడి సంబంధిత ప‌నులు చేప‌ట్టేందుకు నిధులు మంజూరు చేయిమ‌ని చెప్పారు. 

ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీటి స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తాన‌ని మంత్రి హామీ ఇచ్చారు. భావిత‌రాల కోసం ఇవాళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నిర్ణ‌యాలు జ‌రుగుతున్నాయ‌ని, త‌రువాతి త‌రం మ‌రిన్ని మెరుగ‌యిన వ‌స‌తులు అందుకునేలా, మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దేలా ఈ ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఫ‌లితాలు ఇస్తాయ‌న్నారు. దేశానికీ, రాష్ట్రానికీ పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకుని వ‌చ్చే విధంగా రేప‌టి త‌రం ఉండే విధంగా ఈ ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకొని అమ‌లు చేస్తుంద‌న్నారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి మార్పు వ‌చ్చిందో త‌ల్లిదండ్రుల‌ను అడిగితే చెబుతారన్నారు. గ‌తంలో ఇలాంటి మార్పు ఎవ‌రూ చూడ‌లేదని, ఈనాడు అది స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇదీ ఆనాటి ప్ర‌భుత్వానికీ, ఈనాటి ప్ర‌భుత్వానికీ ఉన్న తేడా అని మంత్రి ధ‌ర్మాన అన్నారు. 

అదేవిధంగా శిలగాం - శింగువలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నాడు - నేడులో భాగంగా రూ.132.94 లక్షల అంచనా వ్యయంతో రూపు రేఖ‌లు మార్చ‌నున్నామన్నారు. ఇందులో భాగంగా 6 తరగతి గదులు నిర్మాణానికి 70 లక్షల రూపాయ‌లు కేటాయించామ‌ని, 62.94 లక్షల రూపాయలతో మౌలిక వసతులు కల్పన చేయ‌నున్నామ‌ని తెలిపారు.

``ప్రభుత్వం విద్యకు స‌మున్న‌త ప్రాధాన్యం ఇస్తోంది. అందరూ బాగా చదివి వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగాలని, అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాల్లో మన రాష్ట్రం ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపటి తరం, రేపటి సమాజం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్లు అయినా ఇంకా కొంద‌రిని పేద‌రికం వేధిస్తుంది. అందుకే పేద‌రికం నిర్మూలించి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. సమాజాన్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దడానికి కొన్ని సంద‌ర్భాల్లో ప్రభుత్వం  కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. నిజాయితీగా పని చేయడం అందరూ అలవర్చుకోవాలి. పథకాలు అందించే క్రమంలో పార్టీ చూడడం లేదు. ఆకలి, కన్నీరు, పేదరికం ప్రామాణికంగా అమలు చేస్తున్నాం. హిరమండలం గొట్టా బ్యారేజ్ వ‌ద్ద లిఫ్ట్ పెట్టడానికి రూ.200 కోట్లు అవసరం అవుతుంది. 2023 ఆగస్ట్ లోగా పూర్తి చేస్తాం, 2024 వేసవిలో వంశధార నీరు అందించే ప్రయత్నిస్తున్నాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలి.  ప్రభుత్వానికి ప్ర‌జ‌ల‌ అందరి ఆశీస్సులు కావాలి. ఈ స్కూల్ కి సైకిల్ షెడ్ కావాలి అని అడిగారు, త్వరలో మంజూరు చేసి పూర్తి చేస్తాం.`` అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. 

Back to Top