కృష్ణా: విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని ఎంతదూరమైనా తీసుకెళ్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. దేశంలోని ఇండస్ట్రీస్ను ప్రైవేటీకరణ చేయాలనే దుర్బుద్ధితో కేంద్రం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని విశాఖ స్టీల్ప్లాంట్ మైనింగ్ గేట్ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఉద్యోగుల ఆందోళనకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ను రూ. 2లక్షల కోట్లకు అమ్మేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని, కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారని గుర్తుచేశారు. అదే విధంగా వైయస్ఆర్ సీపీ ఎంపీలు కూడా కేంద్రమంత్రులను కలిసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతిపత్రం కూడా అందించారన్నారు.